ఢిల్లీ, ఫిబ్రవరి 12: ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం సరిగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు హెచ్చరించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు వినతి పత్రం సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాష్ట్రపతి భవన్కు పాదయాత్రగా బయలుదేరారు.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నేరవేర్చకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ భవనం వద్ద సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’ చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు.
మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిజెపియేతర మహాకూటమి నేతలు ఈ దీక్షాశిబిరానికి వచ్చేసి సంఘీభావం తెలిపారు.
పాదయాత్రలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, తదితర మంత్రులు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రముఖ సినీ నటుడు శివాజీ, అమరావతి ఉద్యోగుల జెఎసి చైర్ పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటేరియేట్ ఉద్యోగుల జెఎసి అధ్యక్షుడు మురళీకృష్ణ, ఎపియుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తదితరులు, పెద్ద సంఖ్యలో నాయకులు పాదయాత్రలో పాల్లొన్నారు.
రాష్ట్రానికి సంబంధించి 18 డిమాండ్లపై రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఢిల్లీ నడివీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు.