Photo courtesy: Indian Express
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 15 రోజులకు ఫ్రాన్స్ వెళతారనగా 2015 మార్చి నాలుగవ వారంలో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పారిస్లో ఆ దేశ రక్షణ మంత్రి జా ఇవ్ లిడ్రియాన్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక పేర్కొన్నది. అక్కడ ఆయన ఫ్రాన్ రక్షణ మంత్రి సలహాదారులతో సమావేశమయ్యరు. అదే వారంలో అనిల్ అంబానీ రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను రిజిస్టర్ చేశారు.
అంబానీ పారిస్లో ఈ సమావేశానికి వెళ్లడానికి ముందే ప్రధాని అధికారిక పర్యటన ఏప్రిల్ 9-11 తేదీల్లో ఉన్న విషయం ప్రకటించారు. ఈ పర్యటనలోనే నరేంద్ర మోదీ 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. ఆ ట్రిప్లో ప్రధాని వెంట వెళ్లిన బృందంలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు.
అనిల్ అంబానీ రక్షణమంత్రి కార్యాలయంలో ఆయన స్పెషల్ సలహాదారు జా క్లాడ్ మాలెట్, పరిశ్రమల సలహాదారు క్రిస్టఫర్ సాల్మన్, సాంకేతిక సలహాదారు జేఫ్రీ బుకోలతో సమావేశమయినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. ఎయిర్బస్ హెలీకాప్టర్స్ కంపెనీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపినట్లు, ప్రధాని పర్యటన సందర్భంగా సంతకం చేయాల్సిన అవగాహన పత్రం గురించి ప్రస్తావించినట్లూ తెలిసింది.
ప్రధాని ఫ్రాన్స్ పర్యటనకు ముందు అప్పటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్. జయశంకర్ను మీడియా రఫేల్ గురించి ప్రశ్నించినపుడు, ఆయన చర్చలు ఇంకా నడుస్తున్నాయనీ, ప్రధాని వంటి ఉన్నత స్థాయి నాయకుల పర్యటనల్లో ఇలాంటి రక్షణ ఒప్పందాల చర్చల విషయం ప్రస్థావనకు రాదనీ అన్నారు. కానీ, ప్రదాని పర్యటనలోనే రఫేల్పై అధికారిక ప్రకటన ఉంటుందని అనిల్ అంబానీకి ముందే తెలుసునని ఈ రిపోర్టు ద్వారా అర్ధమవుతుంది.
వివరణ కోసం ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్రతినిధికీ, అనిల్ అంబానీ కార్యాలయానికీ పంపిన మెయిల్స్కు జవాబు రాలేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. రఫేల్ ఒప్పందం కింద రఫేల్ విమానాలు తయారు చేసే దస్సాల్ట్ కంపెనీకి రిలయెన్స్ గ్రూప్ ఇండియాలో కీలక భాగస్వామిగా మారింది. దీని ప్రకారం రఫేల్ కొనుగోలుకు ఇండియా చెల్లించే 787 కోట్ల యూరోల మొత్తంలో దాదాపు 30 వేల కోట్ల రూపాయలు రిలయెన్స్కు అందుతాయి.