గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో కాక రేపుతున్న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టికెట్ వ్యవహారానికి టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈసీటును తనకే ఇవ్వాలని సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోరుతున్నారు. అయితే.. ఆయన విషయంలో ప్రజలు సానుకూలంగా లేరని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు మైలవరంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను తీసుకుని.. ఆయనకు మైలవరం టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతో మైలవరంపై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమాను పెనమలూరుకు పంపించాలని తొలుత నిర్ణ యించారు. దీనిని బోడే వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రెండు నుంచి మూడు సార్లు.. చంద్రబాబు బోడేతో చర్చలు జరిపారు. అయినా ఆయన మెత్తబడలేదు. దీంతో ఇటు ఉమాను దింపినా.. బోడే వర్గం వ్యతిరకత వ్యక్తం చేస్తుందని భావించి. అటు ఉమాకు, ఇటు బోడేకు కూడా ఈ టికెట్ ఇవ్వకుండా.. మధ్యే మార్గంగా మరో కీలక నేతను ఎంపిక చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నారాలోకేష్కు అత్యంత సన్నిహితుడు, ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాద యాత్రకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన దేవినేని చంద్రశేఖర్కు ఈ టికెట్ను ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం.. వ్యాపార వేత్త, ఆర్థికంగా బలంగా ఉండడం.. పార్టీపై అభిమానం ఇలా అన్ని సమీకరణలు కలిసి రావడంతో చంద్రబాబు దేవినేని చంద్రశేఖర్వైపే మొగ్గు చూఫుతున్నట్టు తెలిసింది.
ఇదేసమయంలో తమ్ముళ్ల మధ్య టికెట్ పోరు రగులుతున్న నేపథ్యంలో అటు బోడేకు, ఇటు ఉమాకు కూడా ఇవ్వకుండా.. నారా లోకేష్ సూచనల మేరకు దేవినేని చంద్రశేఖర్కు ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ అసంతృప్తిసెగలు కూడా తగ్గుతాయనే ఒక అంచనాకు చంద్రబాబు వచ్చినట్టు సమాచారం. ఎలా చూసుకున్నా.. ఇది మంచి ఈక్వేషన్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఒక భారం అయితే.. చంద్రబాబు చాలా తెలివిగా దించేసుకున్నారని అంటున్నారు పరిశీలకులు.