Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇటీవల మార్పు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన గురించి నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఆయన పర్యటనకు జనం తరలివచ్చారు, ఆనందంగా స్వాగతం పలికారు. ఒక మహాతల్లి (పెద్దావిడ) జగన్ వద్దకు వెళ్లి నవ్వుతూ మాట్లాడుతోంది. రాష్ట్రంలో పోలీసులు బాగా పని చేస్తున్నారు. లాయర్ లు బాగుపడుతున్నారు. అసలు వ్యవస్థ ఎటువెళిపోతుంది అంటూ ఆవేదనతో బాధతో చంద్రబాబు కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రజలనే తప్పు బడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రజలనే తిడుతున్నాడు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొడుతోంది.
Chandrababu: సీఎం వెళ్లినప్పుడు ప్రజలు కోప్పడలా ? రాళ్లు వేయాలా ?
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి ఒక సెక్షన్ మీడియా ఉంది. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5, మహా టీవి లాంటి ఛానల్స్ ఉన్నాయి. చంద్రబాబు వ్యాఖ్యల్లో అంతర్గత ఉద్దేశాలు, లేని ఉద్దేశాలను అపాదించి ప్రచారం చేయడానికి మరో సెక్షన్ మీడియా ఉంది. సాక్షి, టీవి 9, టీవి 10 తదితర ఛానల్స్ లాంటివి. చంద్రబాబు ఏమి మాట్లాడినా అనుకూలంగా చూస్తారు. వ్యతిరేకంగానూ చూస్తారు. కానీ ఉన్నది ఉన్నట్లు ప్రజెంట్ చేసే మీడియాలు లేవు. చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉంది. ప్రజలు ఎటువంటి జీవన పరిస్థితిలో ఉన్నారు అనేది. సీఎం వెళ్లినప్పుడు ప్రజలు కోప్పడలా ? రాళ్లు వేయాలా ? మీరు రావద్దు అని నినాదాలు చేయాలా, ఏ ప్రజలు కూడా అలా చేయరు కదా. సీఎం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా, ఆవేదన ఉన్నా ఆయన ముందు వ్యక్తం చేయరు కదా. ఎమ్మెల్యేలో, మంత్రులో వెళితే వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ సీఎం వెళ్లినప్పుడు ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతారు. ఏదైనా వరం ఇస్తారనో, అభివృద్ధికి నిధులు ఇస్తారనో, ఇళ్లు కోల్పోయిన వారికి ఏమైనా ఇస్తారనో భావించి స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో ప్రజలు లేని ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఇది 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. సీఎం వెళ్లినప్పుడు ప్రజలు తిరగబడాలని చంద్రబాబు అనుకోవడం తప్పు. సీఎం వచ్చినప్పుడు ప్రజలు తిరగబడే స్థితిలో లేరని అనుకోవచ్చు. ప్రజలను తప్పుబడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి.
Chandrababu: బాబుకే అప్రతిష్ట
ఇటీవల అసెంబ్లీలో ఘటన విషయంలోనూ చంద్రబాబు వ్యవహరించిన తీరుపైనా ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. తనను, తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు, ఆ తరువాత పార్టీ నేతల సమావేశంలో బోరుబోరున విలపించారు. ఆ తరువాత వరద బాధితల పరామర్శకు వెళ్లిన సమయంలోనూ తన సతీమణి భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారంటూ బాధితులకు పదే పదే చెప్పారు. అక్కడ సందర్భం వరద బాధితుల పరామర్శ. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీ జరిగిన ఘటనను తీసుకురావడంతో ఆయన ఒక రకమైన రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు సానుభూతి కోసం చేస్తున్న డ్రామాలు అంటూ ప్రత్యర్ధుల నుండి విమర్శలు వచ్చాయి. వరద బాధితుల ఓదార్పునకు వెళ్లి వాళ్ల నుండి ఓదార్పు తీసుకుంటున్నారు అంటూ ప్రత్యర్ధి మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు జనాలను చంద్రబాబు తిడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగు పడటం లేదని, పరిపాలన బాగోలేదని చంద్రబాబుకు ఆవేదన బాధ ఉండవచ్చు, కానీ ఆ బాధను ప్రజల మీదకు నెట్టేసి వాళ్లను నిందించడం వల్ల అది చంద్రబాబుకే అప్రతిష్ట అని పరిశీలకులు పేర్కొంటున్నారు.