అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపు – కుంకుమ’ సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామనీ, వీటిని అమరావతి, విశాఖ, కడపలో ఏర్పాటు చేస్తున్నామనీ చంద్రబాబు చెప్పారు.
ఈవిఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో సైబర్ నిపుణులు రుజువులు చూపారని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ ఓటు ఎవరికి పడిందో అన్న సంశయం ప్రజలకు ఉండకూడదని చంద్రబాబు అన్నారు. టిడిపి పోరాటం వల్లనే వివిప్యాట్ రశీదులు అమల్లోకి తెచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. వివిప్యాట్ కూడా నూరు శాతం నియోజకవర్గాల్లో అమలు చేయడం లేదనీ, దీనిపై జాతీయ స్ధాయిలో చర్చిస్తున్నామనీ చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ఈవిఎంలను ఉపయోగించడం లేదని, కేవలం 20 దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారనీ చంద్రబాబు చెప్పారు. ఈవిఎంల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, వాటిపై అవగాహన పెంచుకోవాలని నేతలకు ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజెపి వల్ల జరగలేదని, స్వయం కృషితోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించారనీ, ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే లక్ష కోట్లకుపైగా నిధులు కేటాయించారని చంద్రబాబు అన్నారు. కూటమిలో నలుగురు ప్రధానులు అని పేర్కొనడం బిజెపిలో భయానికి నిదర్శనమని ఆయన అన్నారు.