చెన్నై, ఫిబ్రవరి 7: తల లేని మొండెం శరీర భాగలపై ఉన్న పచ్చబొట్టు, గాజుల అధారంగా కేసు దర్యాప్తు చేసి హత్య కేసు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన రెండు వారాల్లోనే పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
చెన్నైలో సినీ నిర్మాత బాలకృష్ణకు 2000సంవత్సంలో సంధ్య (37) అనే మహిళతో వివాహం జరిగింది. ఏడాది నుంచి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్యపై అనుమానం పెంచుకున్న బాలకృష్ణ జనవరి 19వ తేదీన అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి చెన్నైలోని వివిధ ప్రదేశాల్లో పడవేశాడు. తల లేకుండా మొండెం పోలీసులకు దొరికినా తాను పట్టుబడడం జరగదని ఆతని భావన.
పోలీసులు గత నెల డంపింగ్ యార్డ్లో ఒక మహిళకు సంబంధించిన శరీర భాగాలు తల లేకుండా కనుగొన్నారు. ఆ మృతదేహం ఎవరిది అనేది తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వారికి శరీర భాగాలపై శివ, పార్వతుల ఆకృతిలో ఉన్న పచ్చబొట్టు, అక్కడ లభించిన గాజుల ఒక్కటే ఆధారం. ఆ మాత్రం క్లూ చాలనుకుని మహిళ ఎవరో గుర్తించే పనిలో పడ్డారు.
పోలీసుల దర్యాప్తులో సినీ నిర్మాత బాలకృష్ణ భార్య సంధ్య రెండు వారాలుగా కనిపించకుండా పోయిన విషయం బయటకు వచ్చింది. అనుమానంతో బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిదైన పద్ధతిలో విచారణ చేశారు. చేసిన నేరాన్ని బాలకృష్ణ పోలీసుల ముందు అంగీకరించాడు. సంధ్య తల పడవేసిన ప్రదేశం దగ్గరకు కూడా తీసుకువెళ్లాడు. పోలీసులు తలను కూడా సేకరించి కేసు తేల్చారు. బాలకృష్ణను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.
గతంలో బాలకృష్ణ నిర్మాణ దర్శకత్వం వహించి ‘కాదల్ ఇలావనం’ అనే సినిమా తీశారు. మరో చిత్ర నిర్మాణం చేసేందుకు పుట్టింటి నుండి పెద్ద ఎత్తున డబ్బు తీసుకురావాలని భార్య సంధ్యను డిమాండే చేశాడు. దీనిపై సంధ్య ఇంటి నుండి బయటకు వెళ్లి గృహహింస చట్టం కింద గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపారు.