CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండగా, తాజాగా పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ..కేసిఆర్ కు బైబై చెప్పేందుకు సిద్దమవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, ప్రస్తుత వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరిగింది. తన సోదరుడు, కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళతారని ప్రచారం జరిగింది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ ఇవ్వకుండా పైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించడంతో మహేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఆ కారణంగా ఎన్నికల్లోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. పట్నం ఫామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరితే జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా రెడ్డిని చేవెళ్ల లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తొందని సమాచారం. ఈ దంపతుల చేరికకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి, సునీతా రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకోకముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ పార్టీని వీడితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గానే భావించాల్సి ఉంటుంది. గతంలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు.
రేవంత్ సర్కార్ పూర్తి కాలం నిలబడలేదని, తెలంగాణలో కాంగ్రెస్ పడిపోతుందని విపక్షాలు విమర్శిస్తుండగా, రేవంత్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తొంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు గతంలో కేసిఆర్ అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ పాటిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటంతో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వలసలు మరింత ఊపందుకుంటాయనే టాక్ నడుస్తొంది. అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ కీలక కాంగ్రెస్ నేతలు అంటూనే ఉన్నారు.