India Today Survey: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు సంచలనాన్ని రేపుతున్నాయి. పలు సర్వే సంస్థ ఏపీలో వైసీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతుంటే తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో టీడీపీ అఖండ విజయాన్ని సాధించబోతోందని తెలిపింది. ఎన్నికల ముందు వస్తున్న సర్వేలు ఆసక్తిని రేపుతున్నాయి.
జాతీయ మీడియా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తుండటంతో సర్వేల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పార్లమెంట్ స్థానాలపైనే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్ నౌ సంస్థ అధికార వైసీపీకి 19 లోక్ సభ స్థానాలు, టీడీపీ – జనసేన కూటమికి ఆరు స్థానాలు వస్తాయని వెల్లడించగా, దీనికి పూర్తిగా భిన్నంగా ఇండియా టూడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ..టీడీపీ ఏకంగా 17 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.
అధికార వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇక., తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈ సారి పది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. 17 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీ కి 3, బీఆర్ఎస్ 3, మజ్లిస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.
పేరున్న జాతీయ మీడియా సంస్థ సర్వే ఫలితాలే పూర్తిగా భిన్నంగా వెలువడుతుండటంతో ప్రజలు కొంత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. టైమ్స్ నౌ సంస్థ గత నెలలో విడుదల చేసిన సర్వే నివేదికలో 25కి 24 లోక్ సభ స్థానాలు అధికార వైసీపీకి వస్తాయని తెలిపింది. వరుసగా వస్తున్న సర్వేలతో ఏ సర్వే ఫలితాలు నమ్మాలో.. ఏ సర్వే పలితాలను నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికలు ఇంకా రెండు నెలల సమయం ఉండటం, ఈ రెండు నెలల్లో న్యూట్రల్ ఓటర్ల మనసు మారే అవకాశాలు ఉండటంతో ముందస్తు సర్వేల కంటే పోలింగ్ రోజున నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ను మాత్రమే తాము నమ్ముతామని కొందరు పేర్కొంటున్నారు. అయితే తాజా సర్వే మాత్రం తెలుగు తమ్ముళ్లలో ఆనందాన్ని నింపుతోంది.