Corporate Negligence: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగుల పట్ల పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ జరిమానా వేస్తున్నా, లైసెన్సు కాన్సిల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా పలు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు తమ దోపిడీని యదేశ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని అధికారుల తనిఖీల్లోనూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేడు హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పటల్ జరిగిన ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కరోనాతో చికిత్స పొందుతున్న రోగి పెండింగ్ లో ఉన్న రూ.12వేలు చెల్లించలేదని వైద్యం నిలిపివేయడంతో ఆమె మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి మల్లంపేటకు చెందిన రాధ (51) కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా కారణంగా రాధ భర్త కొద్ది రోజుల ముందే చనిపోవడంతో తల్లిని కాపాడుకోవడంతో ఆమె పిల్లలు కామినేని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గత 18 రోజులుగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్ఫెక్షన్ ఉందని చికిత్స చేస్తున్నారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రూ.6 లక్షలకుపైగా చెల్లించారు. అయినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించలేదు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాధితురాలి కుటుంబ సభ్యులు బిల్లు చెల్లించలేదని ఆసుపత్రి సిబ్బంది వైద్యం నిలిపివేశారు.
గత అయిదు రోజులుగా ట్రీట్మెంట్ కు సంబంధించి రిపోర్టులు అడుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది ఇవ్వలేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. నిన్న మంగళవారం రూ.80 వేలు చెల్లించే వరకూ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదని రాధ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ రోజు ఉదయం గుండె పోటుతో మృతి చెందిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. 20 రోజుల క్రితం తండ్రిని కోల్పోయిన ఈ పిల్లలకు ఇప్పుడు తల్లి కూడా చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని వారు ఆందోళన చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇటువంటి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.