warangal central jail: టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాభివృద్ధి క్రమంలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో పలు చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగు అవుతున్నాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న పురాతన కాలం నాటి సచివాలయ భవనం నేలమట్టం అయ్యింది. తాజాగా 135 ఏళ్ల చరిత్ర కల్గిన వరంగల్లు సెంట్రల్ జైలు కథ కూడా త్వరలో ముగియన్నది. కేసిఆర్ సర్కార్ ఈ సెంట్రల్ జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు ఖాలీ చేసే పనులు చకచెకా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పనులు మొదలు పెట్టారు. తొలి విడతగా 119 మంది ఖైదీలను పటిష్ట బందోబస్తు మధ్య మంగళవారం హైదరాబాద్ లోని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
వరంగల్లు సెంట్రల్ జైలులో ఎక్కువగా జీవిత కాలం (లైఫ్) శిక్ష పడిన ఖైదీలు ఉంటుంటారు. సంవత్సరాల కాలంగా ఈ జైలులో ఉన్న కారణంగా వీరికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. దీంతో ఖైదీలను ఒక్కసారిగా వేరే జైలుకు తరలిస్తుండటంతో పలువురు మహిళా ఖైదీలు సొంత ఇల్లు వదిలి వెళ్లిపెట్టి వెళుతున్నట్లుగా కంటితడి పెట్టారు. ఈ జైలు సామర్థ్యం వెయ్యి మంది ఖైదీలు కాగా ప్రస్తుతం 27 బ్యారక్ లలో 956 మంది ఉన్నారు. జైలు ప్రాంగణంలో బ్యారక్ లే కాకుండా అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ఉన్నాయి. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు 70 పడకల ఆసుపత్రి కూడా ఉంది.
Read More: Fake Currency: ఇది నిజంగా ఆందోళన కల్గించే విషయం..! ఆర్బీఐ కీలక ప్రకటన..!!
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయనున్న నేపథ్యంలో ఈ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్ లోని చర్లపల్లి సెంట్రల్ జైలు, చంచల్ గూడ ఓపెన్ ఎయిర్ జైలుతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జైళ్లకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.