అమరావతి, ఫిబ్రవరి 28: శాసనమండలిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలుకి నేడు చివరి రోజు కావడంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి శాసన మండలికి చేరుకున్నారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున నేతలు శాసనమండలికి చేరుకోవడంతో సందడిగా మారింది.
గురువారం ఉదయం ముందుగా ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, జవహర్, అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎపి ఎన్జివోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబు, దువ్వాడ రామారావు, బిటి నాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు.
టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను బుధవారం అర్థరాత్రి టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి చిన్నాన్న కుమారుడు శివనాధరెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు శమంతకమణి, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి మరణంతో ఉప ఎన్నిక జరుగుతున్న విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సి స్థానానికి బుద్దా నాగ జగదీశ్వరరరావును టిడిపి ఎంపిక చేసింది.
వైసిపి ఎమ్మెల్సి అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేశారు.
శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.