హైదరాబాదు, ఫిబ్రవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలో ‘వలస’ల కార్యక్రమం కొనసాగుతోంది. వైసిపిలో తాజాగా గురువారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఒక టెలివిజన్ ఛానల్ అధినేత, జూనియర్ ఎన్టిఆర్ మామ నార్నె శ్రీనివాసరావులు చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు.
‘వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో పదేళ్ల నుండి అనుబంధం ఉంది, నేను వైసిపిలో చేరడానికి జూనియర్ ఎన్టిఆర్కు సంబంధం లేదు.’ అని ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు అన్నారు.
తాడేపల్లిలో వైసిపి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంటేశ్వరరావు కుమారుడు హితేష్లు వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. అంతకు ముందు అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపి రవీంద్రబాబు, మేడా మల్లికార్జున రెడ్డిలు టిడిపి నుండి వైసిపిలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇటీవల టిడిపిలో చేరగా కర్నూలుకు చెందిన సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఆయన వర్గీయులతో మరో రెండు రోజుల్లో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.