శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్నాయుడు అన్నారు.
శ్రీకాకుళంలో గురువారం ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో మాట్లాడుతూ, రైల్వే జోన్ అంశంపై ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పార్లమెంట్లో ప్రశ్నించామని రామ్మోహన్నాయుడు అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాము రైల్వే జోన్ కోసం పోరాటం చేయలేదని, వారి వల్లే వచ్చిందని చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రాలకు ఒక్కో జోన్ ఇచ్చుకుంటూ పోవడం కుదరని తమను అవమానించారనీ, ఇప్పుడు రాజకీయం కోసం రైల్వే జోన్ ప్రకటించారని రామ్మోహన్నాయుడు అన్నారు.
మోది గుంటూరు వచ్చిన సందర్భంలో నిరసనలు వ్యక్తం అయిన కారణంగా విశాఖ సభలో మోదికి అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారని రామ్మోహన్నాయుడు విమర్శించారు.
అయిదేళ్లుగా పార్లమెంట్లో పోరాటం చేసి విశాఖ జోన్ సాధించుకున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల సమస్యలను వైసిపి కేంద్రంపై పోరాటం చేయకపోగా బిజెపి వారు తానా అంటే తందానా అంటున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
భవిష్యత్తులోనూ పోరాటాలు చేసి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకుంటామని రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.