Devineni Chandra Shekar: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట విషాదం నెలకొంది. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ రావు మరణించారు ఆయన కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు రోజుల నుండి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుండి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు తరలించారు.
గత ఎన్నికలకు ముందు దేవినేని ఉమాను విభేదించి దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపునకు ప్రచారంలోనూ దేవినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేవినేని ఉమా మరో సోదరుడు దేవినేని వెంకట రమణ గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే రైలు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సోదరుడు చంద్రశేఖర్ కూడా మరణించడంతో దేవినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
పలువురు నేతలు, కార్యకర్తలు దేవినేని చంద్రశేఖర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.