నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటిదో నిన్నటిదో మొన్నటిదో కాదు.. గత 15 ఏళ్ల నుంచి బెజవాడ టీడీపీలో ఉన్నదే. పైకి చక్కగా సన్నని గొంతు వేసుకుని జగన్మోహన్రెడ్డిని పైపైన తిడుతూ తానొక్కడినే బెజవాడ టీడీపీ కోసం కష్టపడిపోతున్నట్టు చక్కటి యాక్టింగ్ ఉమా సొంతం. కాని గత 15 ఏళ్లలో దేవినేని ఉమా చేసిన రాజకీయంతో ఎంతోమంది కృష్ణా టీడీపీ నేతలు ఉమా రాజకీయ ఎత్తుగడలకు బలైపోయిన వాళ్లే. దాసరి జై రమేష్, దాసరి బాలవర్థన్రావు సోదరులను ఉమా ఎన్నో ఇబ్బందులు పెట్టారని వారే స్వయంగా ఎన్నోసార్లు వాపోయారు.
ఆ తర్వాత దాసరి సోదరులు పార్టీని వీడిపోయారు. ఇక కొడాలి నాని పార్టీ మార్పు వెనక కూడా కారణం ఉమానే. ఉమా పదే పదే గుడివాడ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం పార్టీ అధిష్టానంకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే తాను ప్రత్యామ్నాయం చూసుకున్నానని.. పార్టీలో వవరైనా ఎదుగుతుంటే ఉమా అస్సలు సహించలేడని కొడాలి నాని ఎన్నోసార్లు ఓపెన్గానే కుండబద్దలు కొట్టేశారు. ఇక వంశీది కూడా ఇంచుమించూ కొడాలి నాని బాధే.
2014లో ఉమా ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం కాల్వ ద్వారా తన సొంత ఖర్చుతో మోటార్లు కొని తన నియోజకవర్గ రైతులకు నీళ్లు ఇస్తే ఉమా ఇరిగేషన్ అధికారులపై బలవంతంగా ఒత్తిడి చేసి ఆ మోటార్లు తొలగించేలా చేశారు. ఈ నీళ్లు వల్ల వంశీ ఇమేజ్ ఎక్కడ పెరిగిపోతుందో అన్న ఆందోళనే ఉమాకు ఎక్కువుగా ఉండేదట. విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో గన్నవరంలో వంశీ గెలిస్తే.. మైలవరంలో ఉమా చిత్తుగా ఓడారు. ఇప్పటకీ వంశీ టార్గెట్ ఉమాయే.
ఇక బెజవాడ టీడీపీ రాజకీయాల్లో ఎప్పుడూ వివాద రహితుడిగా ఉండే మాజీ ఎంపీ, ప్రస్తుత బెజవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా ఉమా బాధితుడే. 2014 ఎన్నికల్లో గద్దే భార్య అనూరాధకు జడ్పీ చైర్పర్సన్ ఇవ్వడంతో గద్దేను తూర్పులో తప్పించేసి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి తూర్పు సీటు ఇప్పించే కుట్రకు కూడా తెరలేపారని గద్దే అనుచరులు వాపోతూ ఉంటారు.
ఇక నందిగామ, ఆ తర్వాత మైలవరంలో వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరున్న వసంత ఫ్యామిలీతో చీటికిమాటికి తగాదాలు పెట్టుకోవడం.. లేనిపోని విమర్శలు చేయడం కూడా దేవినేని ఉమాకు అలవాటే. ఇక ఎంతో సౌమ్యుడు అయిన మండలి బుద్ధప్రసాద్ సైతం టీడీపీలోకి వచ్చాక ఉమా దెబ్బకు తట్టుకోలేక రాజకీయాలు చేయలేకపోయాడు. ఆయన ఎన్నోసార్లు తన సన్నిహితుల వద్ద ఉమా చర్యలపై బాధపడ్డారట. ఇక పెడన మాజీ ఎమ్మెల్యే, నాన్ కాంట్రవర్సీ పొలిటిషీయన్ అయిన దివంగత కాగిత వెంకట్రావు గారు అయితే తన నియోజకవర్గానికి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న ఉమా నీళ్లు రాకుండా అడ్డు తగులుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక నూజివీడులో గతంలో గెలిచిన చిన్నం రామకోటయ్య సైతం ఉమా కుట్రలపై ఎన్నోసార్లు వాపోయారు. అసలు ఉమా కంటే ఎవరికి మంచి పేరు వస్తుందన్నా అస్సలు సహించరని రామకోటయ్య గతంలో చెప్పారు. ఇక కేశినేని నాని నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి బెజవాడ ప్లై ఓవర్, దుర్గగుడి ప్లైఓవర్ తెస్తే ఆ మరుసటి రోజే ఉమా విజయవాడలో ప్రెస్మీట్ పెట్టి ఇది శిద్ధా రాఘవరావు ( అప్పటి ఆర్ అండ్ బీ మినిస్టర్), రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం అని పొగిడారు.
ఇంకా చెప్పాలంటే బీసీ నేత బుద్ధా వెంకన్న ఎక్కడ చంద్రబాబుకు దగ్గరవుతారో అన్న బాధ కూడా ఉమాకు ఉంటుంది. ఇటు బొండా ఉమా కూడా ఉమా చర్యల విషయంలో హ్యాపీగా ఉండరు. మైనార్టీ నేత నాగుల్ మీరా బాధలు అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా.. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో ఎంతోమంది ఉమా బాధితులు ఉన్నారు. రేపటి రోజు ఉమాను మైలవరం నుంచి చంద్రబాబు పెనమలూరు పంపితే అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా ఉమా బాధితుడు కాక తప్పదు.