ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు, కమెడియన్ ఆలీ వైసీపీ నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు నుంచే ఆలీ వైసీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తనకు పార్టీ పరంగా మంచి ప్రాధాన్యం ఉన్న పదవి ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ నలుగురు మైనార్టీ లీడర్లకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఆ టైంలోనే ఆలీకి ఎమ్మెల్సీ వస్తుందని అనుకున్నా ఇవ్వలేదు.
ఆ తర్వాత వైసీపీ నుంచి ఏకంగా ఒకేసారి నలుగురు నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు మైనార్టీ కోటాలో ఆలీకి ఖచ్చితంగా రాజ్యసభ వస్తుందని అనుకున్నారు. ఇలా ఎన్నోసార్లు ఆలీకి పదవి వస్తుందని ఆశలు పెట్టడం, మీడియాలో ప్రచారం జరగడమే తప్పా ఎలాంటి పదవి రాలేదు. చివరకు ఊరించి ఊరించి ఊసూరుమనిపిస్తూ ఆలీకి కేవలం ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సవాలక్ష సలహాదారుల్లో ఆలీ ఒక బోడి సలహాదారుడిగా మాత్రమే మిగిలిపోయాడు.
ఈ పోస్టుతో ఆలీకి ఎలాంటి ఒరిగే ప్రయోజనం ఉండదు. మామూలుగానే ఆలీ ఒక్క షోకు లక్ష – రు. 2 లక్షల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఈ లెక్కన ఎలా చూసుకున్నా ఆలీకి నెలకు రు. కోటి నుంచి కోటిన్నర రేంజ్కు పైగానే రెమ్యునరేషన్లు ఉంటాయట. ఈ సలహాదారు పదవితో ఆలీకి నెల మొత్తం మీద రు. 2 – 3 లక్షలకు మించి రావని.. ఆలీ రేంజ్కు ఇది చాలా చిన్న పదవి అని అందరూ పెదవి విరిచారు.
కట్ చేస్తే ఇప్పుడు ఆలీ ఈ సారి వైసీపీ నుంచి ఎన్నికల బరిలో ఉంటాడన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. చివరకు ఈ ప్రచారంపై ఆలీ కూడా స్పందించారు. తాను వచ్చే ఎన్నికల బరిలో ఉండొచ్చన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇంకా సీఎంవో నుంచి తనకు పిలుపు రాలేదని.. త్వరలోనే పిలుపు ఉంటుందని కూడా చెప్పారు. వాస్తవానికి తనను గత ఎన్నికల్లోనే పోటీ చేయమని కోరారని.. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థంకాకుండా పోటీ చేస్తే ఇబ్బందులు ఎదురువతాయనే తాను పోటీకి దూరంగా ఉన్నట్టు ఆలీ చెప్పారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పిలిచి ఫలానా చోటు నుంచి పోటీ చేయ్ అని ఆదేశిస్తే వెంటనే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆలీ తెలిపారు. ఇక ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా అంతిమ నిర్ణయం ఓటరుదే అని.. మేం సిద్ధంగా ఉన్నామని ఆలీ తెలిపారు. ఇక ఆలీని జగన్ నంద్యాల నుంచి పార్లమెంటు బరిలో నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.