టీడీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ లీడర్ దేవినేని ఉమా నోరు తెరిస్తే మాటలు ఎలా కోటలు దాటిపోతూ ఉంటాయో చూస్తూనే ఉంటాం. చాలా మంది ఉమా మాటలు, రాజకీయ వ్యవహారాలు చూసి రెండో చంద్రబాబురా బాబు అని సెటైరికల్ పిలుస్తూ ఉంటారు. ఈ మాట ఎక్కువుగా అనేది కూడా టీడీపీ వాళ్లే. ఇక టీడీపీ నుంచి నాలుగుసార్లు గెలిచి ఇరిగేషన్ మిస్టర్గా కూడా పనిచేశారు ఉమా. గత ఎన్నికల్లో మాత్రం తన చిరకాల రాజకీయ శత్రువులు అయిన వసంత కుటుంబానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇది మాత్రం వసంతకు సరైన రివేంజ్ మార్క్ విజయం.
ఇక దేవినేని వరుసగా నాలుగుసార్లు గెలవడం అంటే ఓ శూరుడు, వీరుడు అన్న కీర్తనలు, కీర్తి కిరీటాలు ఆయన రికార్డుల్లో ఉంటాయి. కానీ నాలుగుసార్లు కూడా ఉమాకు ఏదో ఒక సానుభూతి కలిసి రావడమో, అటు వైపు బలహీన ప్రత్యర్థులు ఎదురు పడడమో జరిగి గట్టెక్కేశారు. ఒక్కోసారి చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా గెలిచిన పరిస్థితి. ఓ సారి 1999 – 2014 వరకు దేవినేని ఉమా గెలుపులు ఎలా లక్గా వచ్చాయో వాస్తవాలే చూద్దాం.
1999 సాధారణ ఎన్నికలకు ముందు నందిగామ ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉన్న ఉమా అన్న దేవినేని రమణ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో అన్న మరణాంతరం వచ్చిన సానుభూతి పవనాలతో ఉమా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఎన్నికల్లో ఉమాపై ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. గట్టి పోటీయే ఉండేది. కేవలం అన్న మృతి సానుభూతి పవనాలతోనే ఉమా గెలిచిపోయారు.
ఇక 2004లో రాష్ట్రం అంతటా వైఎస్సార్ ప్రభంజనం వీచింది. ఉమా 7 వేల చిల్లరతో నందిగామలో రెండోసారి బయటపడ్డారు. 1999లో ఓడిన కృష్ణప్రసాద్ పోటీ చేసి ఉంటే ఉమాపై గెలిచేందుకు వసంతకు 2019 వరకు టైం పట్టే ఉండేదే కాదు… అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీనియార్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలతో కృష్ణప్రసాద్ తండ్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు పోటీ చేయడంతో జనాలు యువకుడు అయిన ఉమా వైపు మొగ్గు చూపారు. అదే అక్కడ జరిగిన రాంగ్ స్టెప్. అయితే ఉమా కేవలం ఎమ్మెల్యేగా గెలిచినా ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీలు, మెజార్టీ పంచాయతీలు గెలిచి ఉమాకు భయంకరమైన ఓటమి రుచి చూపించారు.
2009లో నందిగామ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పక్కనే ఉన్న మైలవరంకు వలసొచ్చాడు ఉమా. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అసలు ఎవరికి ముక్కు మొఖం తెలియని మీసాలు కూడా సరిగా లేని యువజన విభాగం నాయకుడు అప్పసాని సందీప్ పోటీ చేయగా.. ఉమా 13 వేలతో గెలిచారు. ఆ తర్వాత కూడా అప్పసాని సందీప్ పేరు ఎవ్వరికి గుర్తు లేదు. అలాంటి ప్రత్యర్థిపై ఉమా మూడోసారి గెలిచారు. ఇక 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినా, అటు జనసేన, బీజేపీ పొత్తు ఉన్నా కూడా ఉమా చాలా రౌండ్లలో వెనకపడి చివరకు 7 వేల మెజార్టీతో గట్టెక్కారు.
అప్పుడు కూడా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ చివర్లో మైలవరం రావడం మైనస్ అయ్యింది. పైగా బొమ్మసాని సుబ్బారావు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓట్లు చీల్చడం జోగికి మైనస్ అయ్యింది. ఒకానొక దశలో పార్టీ అధికారంలోకి వస్తుంటే ఓటమి అంచుల్లో ఉన్న ఉమా వీరంగాలు లోపల కౌంటింగ్ రూమ్లో ఉన్న వాళ్లే బయట కోకొల్లులుగా చెప్పుకున్నారు. చివరకు 2019లో అసలు సిసలు ప్రత్యర్థి మళ్లీ వసంత కృష్ణ ప్రసాద్ ఎదురుకాగా తొలిసారి ఓటమి రుచిచూశాడు. విచిత్రం ఏంటంటే నాలుగుసార్లు గెలిచి అంత బలమైన నేత అని చెప్పుకునే ఉమాకు వసంత టీడీపీలోకి వస్తుంటే తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని ( వస్తుంది కాదు ఆల్రెడీ వచ్చేసింది ) అని తెగ ప్రస్టేషన్తో బాధపడిపోతున్న పరిస్థితి.