BJP: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.
అయితే ఈ పొత్తులో బాగంగా బీజేపీకి సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ఎంపికలో మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలకు అన్యాయం జరుగుతోందని అసంతృప్తి నేతలు లేఖలో పేర్కొన్నారు. పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పని చేసే వారిని విస్మరించి టీడీపీ నుండి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని వారు పేర్కొంటున్నారు. తాము కేంద్ర నాయకత్వం తీసుకున్న పొత్తులకు వ్యతిరేకం కాదని పేర్కొంటూనే
గతంలో టీడీపీ ఓటమి చెందిన స్థానాలనే ఇప్పుడు బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించారని బీజేపీ రాష్ట్ర నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ పొత్తులో భాగంగా కేటాయిస్తున్న స్థానాల్లో బీజేపీ గలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఏపీలో బీజేపీ దెబ్బతిన్న విషయాన్ని అసంతృప్తి నేతలు వివరించారు.
సిద్ధాంతాలపై పార్టీ కోసం పని చేసిన వారి జాబితా ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదని అసంతప్తి నేతలు తెలిపారు. బీజేపీ ఎంపిక చేస్తున్న అభ్యర్ధులు, టీడీపీ వారి చేతుల్లో ఉన్నారని చెప్పారు. తాము రాసిన లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ నేతలు కోరారు.
పొత్తు వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకూ గళం విప్పిన కొందరు నాయకులకు టికెట్ దక్కకుండా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందు పొత్తులపై బీజేపీ అధిష్టానం అభిప్రాయాలను సేకరించగా, ఏపీ బీజేపీలోని కొందరు నేతలు వ్యతిరేకించగా, మరి కొందరు పొత్తుకు అనుకూలంగా అభిప్రాయాలను వెల్లడించారు.
దీంతో పొత్తును వ్యతిరేకించిన వారికి టికెట్ లు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ లేఖపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు