మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. చనిపోయిన వారిలో అయిదుగురు రోగులు, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తొంది. చందల్ భాటా ప్రాంతంలోని న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రోగులు భయాందోళనకు గురైయ్యారు. ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీసారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆసుపత్రిలోని రోగులను బయటకు తరలించారు. ఆసుపత్రి మొదటి అంతస్తు మొత్తం ధగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల వంతున సాయం అందించనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ .. వారికి అవసరమయ్యే వైద్యసాయానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.