కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అటు విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి ఒక్క సారిగా ఊపు వచ్చింది. పవన్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంతో పాటు అటు విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న గాజువాక రెండు స్థానాల్లో ఎమ్మెల్యే గా పోటీ చేశారు. అయితే దురదృష్ట వశాత్తు పవన్ రెండు చోట్లా కూడా ఓడిపోయారు. అయితే ఈ సారి పవన్ తాను గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం లేదా గాజువాక రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.
పవన్ ఈ సారి భీమవరం నుంచి పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారనే అనుకన్నారు. కట్ చేస్తే పవన్ ఈ సారి పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ట్విస్ట్ ఇచ్చేశారు. భీమవరం, గాజువాక రెండు స్థానాలను వదిలేసుకున్నారు. గాజువాక పొత్తులో భాగంగా టీడీపీకి వదిలేశారు. ఇటు భీమవరం సీటును టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కు జనసేన కండువా కప్పి ఆయనకు కేటాయించారు. పవన్ తాను కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పగానే అక్కడ టీడీపీ ఇన్చార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ తో పాటు ఆయన అనుచర గణం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పవన్ పోటీ చేస్తే తాము ఓడిస్తామంటూ టీడీపీ కేడర్ శపథాలు చేసింది. సాక్షాత్తూ పొత్తులో భాగంగా జనసేన అధినేత పోటీ చేస్తే స్వాగతించాల్సింది పోయి అక్కడ టీడీపీ కేడర్ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి, జెండాలు తగల పెట్టడంతో అసలు ఇదేం మిత్ర ధర్మం అంటూ ఏపీ వ్యాప్తంగా ఉన్న జనసేన కేడర్ కూడా అసహనం వ్యక్తం చేసింది.
దీంతో చంద్రబాబు వర్మను పిలిపించుకుని హామీ ఇచ్చారు. పవన్ను మంచి మెజార్టీతో గెలిపించుకు వస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి పదవి నీకే ఇస్తానని తెలిపారు. దీంతో వర్మ చల్లబడ్డారు. ఇప్పుడు అక్కడ వర్మ పవన్ను గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు. వర్మకు పిఠాపురంలో పార్టీలతో సంబంధం లేకుండా బలం ఉంది. వర్మ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకంగా 48 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదు.
అయితే వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన క్యాండెట్కు డిపాజిట్ కూడా దక్కలేదు. వర్మ అసంతృప్తితో ఆయన్ను తన వైపునకు తిప్పుకుని వైసీపీ సీటు ఇస్తుందన్న ప్రచారం బాగా జరిగింది. అయితే వైసీపీ తమ క్యాండెట్ను మార్చలేదు. వైసీపీ కూడా వంగా గీతనే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మార్పులు ఉండే అవకాశం లేదని అంచనాకు వచ్చారు. ఇక వర్మ కూడా పవన్ కోసం కదలడంతో పవన్కు 40 – 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందన్న అంచనాలు అయితే బలంగా ఉన్నాయి.