టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉంటారా బయటకు వెళతారా ? రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరు లేదు. ఆయన ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఆయన విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరారు. గంటా కూడా మీడియా ముఖంగా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని తాను ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని చెప్పారు.
గంటా ఉమ్మడి విశాఖలోని విశాఖ నార్త్ – భీమిలి – అనకాపల్లి – చోడవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రతి ఎన్నికకు ఆయన నియోజకవర్గం మారుతూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన తర్వాత తన సీటు విషయం చంద్రబాబు చూసుకుంటారు అంటూ గంట నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు గంటా తనకు ఇస్తే భీమిలి సీటు ఇవ్వాలని చంద్రబాబుకు హుకూం జారీ చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పారు లేదో కానీ గంటా మాత్రం భీమిలి నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు తన కసరత్తుని ప్రారంభించారని అంటున్నారు.
భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2014 ఎన్నికలలో గంటా భీమిలీ నుంచి పోటీ చేసి ఏకంగా 37 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. పైగా మంత్రి కూడా అయ్యారు. ఆ సెంటిమెంట్తోనే మళ్లీ అక్కడ నుంచి పోటీ చేస్తాను అని గంటా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా చంద్రబాబు ఈ సీటుని పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటాపై విశాఖలో చాలా వ్యతిరేకత ఉంది.. జనసేన – టిడిపి పొత్తులో భాగంగా తనకు భీమిలి కంటే బెస్ట్ సీటు లేదని భావిస్తున్నారట.
చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో ? కానీ గంటా మాత్రం భీమిలి నుంచి పోటీకి ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంటా కోరుకున్నట్టుగా ఆయనకు భీమిలి సీటు ఇవ్వకపోతే గంటా షాకింగ్ నిర్ణయం తీసుకుంటారని చర్చలు కూడా విశాఖలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు తనకు భీమిలి సీటు కాదని.. ఏ చీపురుపల్లో ఇస్తారనే గంటా బెదిరింపు రాజకీయాలకు దిగినట్టుగా కూడా స్థానికంగా చర్చ నడుస్తోంది.