దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో నెల రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను గద్దె దింపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బిజెపి కూడా అనూహ్యంగా పుంజుకుంది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బిజెపిలో ఈసారి లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణలో అత్యధిక సీట్లు సంపాదించడం అవసరమని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలోని అభ్యర్థులు ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలిచి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తన గత ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉంటాయి ? ఏ పార్టీకి అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నదానిపై జోరుగా సర్వేలు జరుగుతున్నాయి.
పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ఇక్కడ సర్వేలు చేస్తున్నాయి. అన్ని సర్వేలలోనూ కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకుంటుందని క్లియర్ గా కనబడుతోంది. తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సంస్థ మొత్తం రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాలలో సర్వే నిర్వహించగా ఈ 12 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. మొత్తం ఓట్ల శాతం లో కాంగ్రెస్ పార్టీకి 46% ఓటర్లు మద్దతుగా ఉన్నారని పేర్కొంది.
అంటే రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో బిజెపి నిలుస్తుందని ఆ పార్టీకి 30% ఓట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం 22 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది. ఓవరాల్గా కేసీఆర్ పై గోవిందా అని తాజా సర్వే తేల్చింది. బీఆర్ఎస్ కు ఎన్నికలకు జీవన్మరణ సమస్యగా మారాయి.
ఇక మొత్తం 17 సీట్లలో కాంగ్రెస్కు 12 సీట్లు వస్తే… హైదరాబాద్ ఎంఐఎంకు ఉంటుంది. బీఆర్ఎస్ మెదక్లో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక బీజేపీకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్లలో మూడు చోట్ల మాత్రమే ఛాన్సులు ఉన్నాయని సర్వే చెపుతోంది.