Suicide: భర్త, అత్తింటి వారి వేధింపులకు మహిళ ఆత్మహత్య అంటూ ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి. దీంతో భర్త, వారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరెస్టు చేసి జైలుకు పంపడం రివాజే. కానీ ఇప్పుడు ఒక రివర్స్ ఫిర్యాదు నమోదు అయ్యింది. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రొంపిచర్ల మండల కేంద్రంలో బొసు బొమ్మ సెంటర్ లో నివాసం ఉండే ఎలికా రామకృష్ణ (32) కు ఈవూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన గొర్రె భూలక్ష్మితో పది నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి వారిరువురి మధ్య విభేదాలు వచ్చి ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పలు దఫాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Read More: MP Navneet Kaur: అమరావతి ఎంపి నవనీత్ కౌర్ కు భారీ ఝలక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ఈ నేపథ్యంలో రామకృష్ణారావుకు అతని భార్య భూలక్ష్మి, అత్తామామల నుండి వేధింపులు ఎక్కువ అయ్యాయి. పోలీసు కేసు పెడతామని భార్య తరపు వారి బంధువుల నుండి బెదిరింపులు రావడంతో రామకృష్ణారావు ఆందోళనకు గురైయ్యాడు. తీవ్ర మనస్థాపంతో జీవితంపై విరక్తి చెంది మరణలేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ రామకృష్ణారావు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అతని సూసైడ్ నోట్ లో ప్రస్తుతం దేశంలో చట్టాలు ఆడవాళ్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ చట్టాలను ఆసరాగా చేసుకుని మొగుళ్ల మీద వారి కుటుంబ సభ్యుల మీద కేసులు పెడుతూ పోలీసు స్టేషన్ లకు, కోర్టులకు లాగుతున్నారని వాపోయాడు. “నాకు ఇక్కడ న్యాయం జరగదని అర్థమైంది. నా లాంటి మగవాళ్లు ఎందరో సమాజం కోసమని వాళ్లు పెట్టే బాధలను నాలుగు గోడల మధ్య అనుభవిస్తూ చస్తూ బతుకుతున్నారు. నా మరణం వల్ల ఒక్క మగాడికైనా నా భార్య లాంటి ఆడవాళ్ల నుండి రక్షించబడితే చాలు” అంటూ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.