YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు సాగారు. కరోనా కలకలం నేపథ్యంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ పొడగించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడయ్యారు. జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం స్పష్టం చేసింది.
ఇక్కడ షరతులు వర్తిస్తాయి…
కాగా, పలు జిల్లాల విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా అదుపులోకిరాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఏపీ సీఎం జగన్ ఇప్పటికే…
మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం ఇప్పటికే లాక్ డౌన్ పొడగించింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన కోవిడ్ సమీక్షలో జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో నిబంధనల సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సేవలు అందించనున్నాయి.