వైసీపీ పంటి కింద రాయిలా మారిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు మళ్లీ పంచ్ డైలాగులు వేసేశారు. ఈసారి ఆయన జగన్ సామ్రాజ్యంలో రెడ్ల పాత్రపై అనర్గళంగా మాట్లాడారు.
జగన్ పాలనలో రెడ్ టేపిజం లేదుగానీ రెడ్డిజం ఉందంటూ కుండ బద్దలు కొట్టారు.రాష్ట్రంలో వేరే కులమే లేదన్నట్లు రెడ్లకు అన్ని పదవులు ఇస్తున్నారని కూడా ఆయన ధ్వజమెత్తారు! రెండు పోస్టులు ఉంటే ప్రధానమైన రెడ్డి కి ,ప్రాధాన్యత లేనిది బిసి కి ఇస్తున్నారని ఆయన విశ్లేషించారు. కులాలు లేని క్రైస్తవ మతాన్ని అనుసరించే ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమైన విషయాలలో పేర్లలోని చివరి రెండక్షరాలు చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
ఈ సందర్భంగా జగన్ కారణంగా పదవులు పొందిన రెడ్ల జాబితాను ఆయన చదివి వినిపించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి శివ రెడ్డి భాస్కర్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి విప్ పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. సీఎం సలహాదారులుగా అజయ్ కల్లాం రెడ్డి ధనంజయ రెడ్డి ,నాగేశ్వర రెడ్డి ఉన్నారన్నారు. టీటీడీ చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డి ,సభ్యులుగా పుత్తా ప్రతాపరెడ్డి ,వేమిరెడ్డిప్రశాంత్ రెడ్డి అధికార హోదా అనుభవిస్తున్నారని తెలిపారు. వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేసిన దేవేందర్ రెడ్డి కి ఇప్పుడు డిజిటల్ మీడియా ఇన్చార్జి పదవి ఇచ్చారని ఆయన వివరించారు.
పనిలో పనిగా తన విగ్గుపై కామెంట్ చేసిన దేవేందర్ రెడ్డికి క్షమాపణలు చెప్పడానికి ఆయన నలభై ఎనిమిది గంటల గడువు ఇచ్చారు లేకుంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరగా తను రెడ్ల కి వ్యతిరేకం కాదని ,తన మనవడి పేరు కూడా రాజశేఖర్రెడ్డి అని ,అయితే కొందరు రెడ్లకారణంగా ఆ కుల ఆకుల ప్రతిష్ట మంట కలుస్తోంది కాబట్టి తాను స్పందిస్తున్నట్లు ఎంపీ ముగించారు