వైసీపీలో ఒక్కో జాబితా వస్తోందంటే చాలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో గుండె దడ మొదలవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల టెన్షన్ అయితే మామూలుగా లేవు. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు లిస్టుల్లో చాలా పేర్లు తారు మారు అవుతున్నాయి. మూడో లిస్టులో తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి పంపారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం అలకబూని టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీంతో జగన్ సైతం వెనక్కు తగ్గక తప్పని పరిస్థితి. గురుమూర్తిని వెంటనే తిరుపతి లోక్సభ రేసులో నిలుపుతున్నట్టు ఐదో లిస్టులో మార్పుచేశారు. జగన్ చాలా తక్కువ మందిని మాత్రమే పక్కన పెడుతుండగా.. అందరు అభ్యర్థులకు స్థానచలనం చేస్తూ వస్తోన్న జగన్ తనను నమ్ముకుని ఉన్న ఓ మహిళా నేత.. అందులోనూ మహిళా ఎంపీకి మాత్రం పెద్ద షాకే ఇచ్చారు. ఆమెకు ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటు ఇచ్చి మురిపించి ఇప్పుడు అటు ఎంపీ సీటు, ఇటు ఎమ్మెల్యే సీటు లేకుండా ఆమె రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి గత ఎన్నికల్లో కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే అరకు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి రాజకీయంగా కురువృద్ధుడు అయిన వైరిచర్ల కిషోర్చంద్రదేవ్పై ఏకంగా 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి జెయింట్ కిల్లర్గా నిలిచారు. మాధవి ఎవరో కాదు పాడేరు మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె. తాజాగా మార్పులు, చేర్పుల్లో జగన్ మాధవిని అరకు అసెంబ్లీ ఇన్చార్జ్గా నియమించారు. మాధవి పాడేరు నియోజకవర్గానికి చెందిన వారు.
అరకు వైసీపీ నేతలు లోకల్, నాల్ లోకల్ నినాదం తెచ్చారు. దీంతో జగన్ అరకుకు లోకల్ అయిన రేగం మత్స్యలింగాన్ని ఐదో జాబితాలో ఇన్చార్జ్గా నియమించారు. పోనీ పార్లమెంటుకు వెళదామంటే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఇప్పటికే అరకు పార్లమెంటు ఇన్చార్జ్గా నియమించారు. మాధవి ఎంపీగా ఐదేళ్లలో తన ముద్ర వేయకపోయినా వివాదాలకు దూరంగా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు.
ఇప్పుడు ఆమెకు ఉన్న అసెంబ్లీ సీటు, పార్లమెంటు సీటు రెండు తీసేసినట్టు అయ్యింది. మరి ఎన్నికలకు ముందు ఆమెకు అధిష్టానం ఏదో ఒక సీటు ఇస్తుందో ? లేదా సైడ్ చేసేస్తుందా ? మాధవి రాజకీయ జీవితానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పడినట్టేనా ? ఆమె రాజకీయ జీవితం ఎలా మారుతుందో ? మరో రెండు నెలల్లో తేలిపోనుంది.