అంతర్వేది దేవాలయంలో రథం దగ్ధమవడం అనేక మంది మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదనలు జగరుతున్నాయి.
ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తోంది. అయితే దీనిక వైఓస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అలాంటిదా?
అంతర్వేది ఘటనలో దోషులను శిక్షించటానికి ప్రభుత్వం బాధ్యతగా ప్రయత్నిస్తుంటే.. నిరసనలా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రథం తగలబెట్టడం ఎంత తప్పో.. చర్చిల మీద రాళ్ళు వేయటం కూడా అంతే తప్పు అని అంబటి పేర్కొన్నారు. విధ్వంసాలు సృష్టించి.. దహన కాండలు చేసి, అన్యాయాలు చేసి, రాజకీయాల్లో బతకాలనుకునే ప్రభుత్వం తమది కాదని వెల్లడించారు. “తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా అందర్నీ మోసం చేసి పైకొద్దామనుకునే వ్యక్తులు, అటువంటి మనస్తత్వాలు కలిగినవారు ఎవరూ ఇక్కడ లేరు. చంద్రబాబు గురించి ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకంలో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే చాలా స్పష్టంగా చెప్పారు“అంటూ అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతం గుర్తుందా చంద్రబాబు?
ఈ సందర్బంగా గతంలో జరిగిన పలు సంఘటనలను అంబటి రాంబాబు ప్రస్తావించారు. `చంద్రబాబు నాయుడుకు దైవ భక్తి లేదు. దైవం అంటే భయం లేదు. అధికారం తప్ప చంద్రబాబుకు ఇంకేమీ పట్టవు. చంద్రబాబుకు హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు లేదు. తిరుమల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే అధికారంలో ఉండగా హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడలేదు. దేవాలయాల ఆస్తులు పరిరక్షించలేదు. విజయవాడలో 39 పురాతన దేవాలయాలను కూలగొట్టి.. మున్సిపాలిటీ వ్యానుల్లో విగ్రహాలను దారుణంగా తరలించిన దుర్మార్గమైన ప్రభుత్వం చంద్రబాబుది. ఇది ప్రజల మస్తిష్కాల నుంచి ఇంకా చెరిగిపోలేదు.“ అని అంబటి స్పష్టం చేశారు.
సీబీఐ విచారణతోనే బాబును బుక్ చేశారుగా?
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాటు సెటైర్లు వేశారు. “సీబీఐ మీద మీకు ఎప్పుడు నమ్మకం వచ్చింది చంద్రబాబూ? మీరు అధికారంలో ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదని, ఐటీ సోదాలు జరగటానికి వీల్లేదని, కేంద్ర సంస్థలన్నీ రాష్ట్ర బార్డర్ దాటి రావటానికి వీల్లేదని చెప్పిన మీకు, వాటిపై ఎప్పుడు నమ్మకం కలిగింది“ అంటూ ఎత్తిపొడిచారు. అధికారం పోయాక..రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం పోయి… కేంద్ర సంస్థల మీద నమ్మకం పెరిగిందా అంటూ చంద్రబాబు నాయుడు తీరును తప్పుపట్టారు.
ఎందుకిలా చేస్తున్నారు.
దోషులు ఎవరైనా, రథాన్ని కాల్చిన వారు ఎంతటివారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఏ ఎంక్వైరీ వేయటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. “సీబీఐ విచారణకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మీద బురదచల్లే కార్యక్రమాలు మానండి. మతాల మధ్య చిచ్చు పెట్టి.. ఆ మంటల్లో చలి కాల్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో వెళుతున్నారు. కులాన్ని, మతాన్ని, అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు.“ అని అన్నారు. అంతర్వేది ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానీ, అసమర్థతగానీ లేనే లేవని అంబటి రాంబాబు తెలిపారు. “ఇది అనుకోని ఒక దురదృష్ట ఘటన మాత్రమే. దోషులను శిక్షించి.. అన్ని మతాల గౌరవాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం.“ అని ఆయన తేల్చిచెప్పారు.