ఏపీలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ – జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీట్ల లెక్కల్లో రెండు పార్టీల నేతలు మునిగి తేలుతున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి ? ఏయే సీట్లు ఇవ్వాలన్న లెక్కల్లోనే చంద్రబాబు ఉన్నారు. ఇక అనూహ్యంగా ఇప్పుడు ఇదే కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరుతుందంటున్నారు. బీజేపీని కాసేపు పక్కన పెడితే ఏపీలోనే టీడీపీ – జనసేన కూటమి బాగా పనిచేసే జిల్లాల్లో రెండు గోదావరి జిల్లాలు ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే గోదావరి జిల్లాల్లో కూటమి పూర్తిగా స్వీప్ చేస్తుందనే అంటున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ – బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది. ఈ ఎన్నికల్లో వెస్ట్ గోదావరిలో అన్ని సీట్లు స్వీప్ చేసిన టీడీపీ కూటమి.. ఈస్ట్లో నాలుగు సీట్లు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు సీట్లు స్వీప్ చేసేసింది. 2014 ఎన్నికల్లో కూటమిని తట్టుకుని కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలో జగ్గంపేట, ప్రత్తిపాడు, తునిలో మాత్రమే వైసీపీ గెలిచింది. అమలాపురం పార్లమెంటు పరిధిలో కొత్తపేట, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి సీట్లు మాత్ర స్వల్ప తేడాతో కోల్పోయింది.
ఇక ఇప్పుడు కూటమి ఎఫెక్ట్తో రెండు గోదావరి జిల్లాల్లో ఆ ప్రభావం వైసీపీపై గట్టిగా ఉండనుంది. గత ఎన్నికల్లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. వైసీపీ రెండు జిల్లాల్లో ఉన్న ఐదు పార్లమెంటు సీట్లతో పాటు మెజార్టీ అసెంబ్లీ సీట్లు గెలిచింది. టీడీపీ ఒక్క ఎంపీ సీటు గెలవలేదు సరికదా.. వెస్ట్లో పాలకొల్లు, ఉండి, ఈస్ట్లో రాజమండ్రి సిటీ, రూరల్, మండపేట, పెద్దాపురం సీట్లు మాత్రమే గెలిచింది. ఈ సారి రెండు జిల్లాల్లో ఉన్న మొత్తం 34 సీట్లలో రెండు, మూడు మినహా అన్ని సీట్లు కూటమే గెలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే జగన్ లెక్క వేరేగా ఉందట. తమకు సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ సీట్లు వస్తాయని.. రెండు గోదావరి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు 5 సీట్లు వేసుకున్నా 10 సీట్లు వస్తే చాలని లెక్కలు వేసుకుంటున్నారట. అంటే గోదావరి జిల్లాల నుంచి 10 సీట్లకు మించి ఎక్కువ వైసీపీ పెద్దలు ఆశించడం లేదట. తమ బలం అంతా సీమ, ఉత్తరాంధ్రతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరులో సోషల్ ఇంజనీరింగ్తో కొన్ని సీట్లలో వర్కవుట్ అయితే చాలని.. గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు రాకపోయినా మరోసారి మెజార్టీ మార్క్ క్రాస్ అయ్యి అధికారం చేపడతున్నామని జగన్ పార్టీ నేతలతో చెపుతున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ లెక్కలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో ? చూడాలి.