వైసీపీ అధినేత జగన్.. తన ఎన్నికల అస్త్రాలు బయటకు తీసేశారు. వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేశారు. ఒకరకంగా ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాలుగానే మారనుంది. తాను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పథకాలను కొనసాగాల్సిందేనన్నది ప్రధాన అంశం. ప్రస్తుతం జగన్ ప్రారంభించిన పథకాల్లో కీలకమైనవి ఆరోగ్యశ్రీలో అనేక రోగాలను చేర్చారు. ఇక, పింఛన్లను, వలంటీర్ వ్యవస్థను, సచివాలయా లను కూడా కొనసాగాలించాలి. అదే సమయంలో 104, 108 వంటివి కూడా నిరంతరాయంగా కొనసాగించాలి.
ఈ క్రమంలోనే ఆయా పథకాలకు అవుతున్న వ్యయాన్ని జగన్ వివరించారు. వీటిని కొనసాగిస్తూనే.. చంద్ర బాబు ప్రకటిత సూపర్ సిక్స్ సహా బీసీ డిక్లరేషన్ వంటివాటిని అమలు చేయాలని.. వీటికి సొమ్ములు ఎక్క డ నుంచి తెస్తారనేది సీఎం జగన్ కీలక ప్రశ్న. అయితే, ఇప్పటికే.. చంద్రబాబు తాము సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోవని చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకునే సీఎం జగన్ తాజాగా లెక్కలు వెలువరించారు. మీరు సృస్టించే సంపద ఎంత? ఎప్పటికి సృష్టిస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అనేది కీలకంగా మారింది. ఈ విషయంలో చంద్ర బాబు కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, ఇదేసమయంలో సంక్షేమంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాబట్టి. తన పాలనలో రాష్ట్రం వెనుకబడి పోయిందన్న విమర్శలను కూడా ఆయన తోసిపుచ్చినట్టయింది.
ఇక, ఎటొచ్చీ.. చంద్రబాబు చెబుతున్న పథకాలు అమలు చేసేందుకు ఎక్కడ నుంచి సొమ్ము తెస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. సంపదసృష్టి.. అంటే.. కనీసంలో కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకు ఈ పథకాలను నిలుపుదల చేస్తారా లేక అమలు చేస్తారా? ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు? అనేది ముఖ్యం. ఎలా చూసుకున్నా.. తాజాగా సీఎం జగన్ చేసిన ప్రకటన, నిధులు, సంక్షేమ కంపేరిజన్ వంటివి చంద్రబాబు వివరణ కోసం ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి.