(అమరావతి నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి)
హింధూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు, బిీజేపీకి ఆయుధంగా మారుతున్నాయి. మరి దీనికి బ్రేక్ లు వేసేది ఎక్కడ? దేవాదాయ శాఖ చూస్తున్న మంత్రి ఏమి చేస్తున్నట్లు? పోలీసులు ఏమి చేస్తున్నట్లు? ఆ శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్లు? ఇవన్నీ జగన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అందుకే ఏదో ఒక ఖటిన నిర్ణయం తీసుకోవాలని జగన్ ఫిక్స్ అయ్యారట. దీనికి సంబంధించి సచివాలయంలో ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అదికారులు, పోలీసులపై చర్యలతో ఆగుతున్నాయా?
అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనర్శింహస్వామి రథం ధగ్ధం, అంతకు ముందు సింహాచలం దేవస్థానంలో ఒ వివాదం, ఆ తరువాత వరుసగా హింధూ దేవాలయాలలో విగ్రహాలు కూల్చివేత, దేవాలయాలపై దాడులు, ఇవన్నీ ఎంత సంచలన అంశాలుగా మారాయో అందరికీ తెలిసిందే. వైసీపీని గట్టిగా ఇరుకున పెట్టడానికి అస్త్రం లేని బీజేపీ, విశ్వహింధూ పరిషత్, జనసేన లాంటి పార్టీలు కూడా జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. వీటన్నింటికి తోడు మంత్రి కొడాలి నాని కూడా అగ్నికి ఆజ్ఞం పోసినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలని, అధికారుల్లోనూ, మంత్రుల్లోనూ మార్పులు వచ్చేలా ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒ కీలక నిర్ణయం ద్వారా ఈ దాడులకు పాల్పడుతున్న వారికి హెచ్చరిక జారీ చేయాలన్నది జగన్ యోచన.
వెల్లంపల్లికి శాఖ మార్పు లేదా ఉధ్వాసన..!
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని మంత్రి వర్గం నుండి తప్పిస్తారని లేదా శాఖను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ, పార్టీ వ్యతిరేక వర్గాల్లోనూ, సచివాలయంలో కూడా ఇటువంటి చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా హిందూ దేవాలయాలపై దాడులను సాకుగా చూపించి దేవాదాయ శాఖ మంత్రిని ఆ పదవి నుండి పూర్తిగా భర్తరఫ్ చేసే అవకాశం అయితే లేదు. అందుకు సామాజిక వర్గాలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ విధివిధానాలు అనే చాలా అంశాలు జగన్ కు అడ్డువచ్చే అవకాశం ఉంది. అందుకే శాఖ మార్పు చేసి వెల్లంపల్లికి మరో భాధ్యతలు అప్పగించి మరో సీనియర్ మంత్రికి దేవాదాయ శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ యోచిస్తున్నారట. అక్టోబర్ 1వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. ఆ సందర్భంగానూ ఈ మార్పులు చేర్పులపై తన సన్నిహిత మంత్రులతో జగన్ చర్చించి ఆమోదిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.