YSRCP: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమికి వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇటీవలే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు. తాజాగా ఇవేళ అదే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలకు సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆరు నెలల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పిఠాపురం నియోజవర్గ మాజీ ఇన్ చార్జి మాకినీడి శేషకుమారి ఇవేళ వైసీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. శేష కుమారి 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 28వేలకుపైగా ఓట్లు సాధించారు. ఆరు నెలల క్రితం జనసేన ఇన్ చార్జి బాధ్యతల నుండి శేష కుమారిని తప్పించి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. దాంతో మనస్థాపానికి గురైన శేషకుమారి జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
గత ఆరు నెలలుగా ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నేతలు శేష కుమారిని సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆమె ఇవేళ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి, ఎంపీ వంగా గీత, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పాల్గొన్నారు.
వైసీపీలో చేరిన తర్వాత శేష కుమారి మీడియాతో మాట్లాడుతూ..పవన్ పార్టీకి ఒక నిబద్దత లేదని విమర్శించారు. పవన్ ను జనం నమ్మే పరిస్థితి లేదని అన్నారు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు అని విమర్శించారు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్ధం చేసుకోలేడని అన్నారు. జనసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయన్నారు. సీఎం జగన్ తో అసలు పవన్ ను ఎవరూ పోల్చుకోరని అన్నారు. పవన్ చెప్పే సిద్దాంతాలు మైకుల ముందే పరిమితమని, ఆచరణలో ఏమీ చేయరని అన్నారు.
అలానే విజయవాడకు చెందిన బీజేపీ నేత, రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని నరేంద్ర వ్యాఖ్యానించారు.
స్వలాభం కోసమే టీడీపీ ప్రభుత్వం గతంలో పని చేసిందని, పేదల కోసం పని చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన అన్నారు. తన సోదరుడు వంగవీటి రాధ కిందటి సారి వైసీపీని వీడి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదని, వారి స్వార్ధం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Janasena: పవన్ కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ షాక్