(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
వినూత చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి. అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి మరి, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పార్టీలో చేరి టికెట్ను సాధించారు. ఆమె భర్త చంద్రబాబు సైతం సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ పార్టీ కోసం కష్టపడుతూ కార్యక్రమాలు చేస్తుంటారు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కు అంతగా బలం లేకుండా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ, కార్యకర్తలను సమీకరించడంలో వీరు ముందు ఉంటారు. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కు వినూత ఒక ప్లస్ పాయింట్. విషయం ఏమిటంటే…. ఈ నాయకురాలి పై, ఆమె కుటుంబం పై ఇంటిపై ప్రతిసారి అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల సమయంలో రోడ్డు మీద ఆమెను బహిరంగంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేయడం మీడియా లో వచ్చింది. అంతకు ముందు ఒకసారి కూడా వినూత్న ఇంటిపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడులు చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం వినూత్న ఇంటిపై దాడి చేసి ఆమె కారును ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కేసు నమోదుకు వేచి చూసిన పోలీసులు తర్వాత తాపీగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుల ఎవరు అనేది పూర్తి ఆధారాలు ఇచ్చిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి వెనుక ఉండే కొందరు అనుచరులే ఈ దాడిలో పాల్గొన్నారని ఇది వినూత్న ఆరోపణ. వారి తాలూకా చిత్రాలను పోలీసులకు ఆమె అందించిన చర్యలు మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తయితే ఆమె సొంత పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ దాడి విషయాలను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఒక మహిళా నాయకురాలు పై పదేపదే దాడులు జరుగుతున్నా నాయకుల స్పందన మాత్రం లేదు. రాష్ట్ర పార్టీ నాయకులు మాట అటుంచి స్థానిక నాయకులు కూడా వినూతకు మద్దతుగా ముందుకు రావడం లేదు. కేవలం ఆమె ఒంటరి పోరు చేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోరాడుతున్నారు.
ఇదేం రాజకీయం?
వినూత పై ఇప్పటికే మూడు సార్లు అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ మూడు సార్లు దాడులు విషయాలు పార్టీ అధినేత వరకు వెళ్లిన అక్కడి నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. కేవలం ఫోన్ లో విషయాలు కనుక్కొని ఒకసారి పవన్కళ్యాణ్ నేరుగా మాట్లాడినట్లు తెలిసింది తర్వాత దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం తాజాగా జరిగిన దాడి తీవ్రమైనది. రాత్రి వేళ ఇంటికి వచ్చిన కొందరు అగంతకులు కారు ధ్వంసం చేయడమే కాకుండా ఇంటిని ధ్వసం చేసేందుకు చూశారు. ఇలాంటి ఈ సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచి దీన్ని రాజకీయం చేసి లబ్ది పొందాల్సిన జనసేన పార్టీ నేతలు దాన్ని కనీసం పట్టించుకోవడం విశేషం. సానుభూతితో పాటు మహిళా నేత మీద దాడి జరిగిందనేది ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉన్న దాన్ని పార్టీ విని యోగించు కోలేకపోతుంది. కనీసం పార్టీ మహిళా నేత కూడా మద్దతు లభించలేదు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అక్కసు వెల్లగక్కుతున్నారు.