జార్ఘండ్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కారు నుండి పెద్ద మొత్తంలో నగదును బెంగాల్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ అంశాన్ని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యేలు ఇర్పాన్ అన్సారీ, రాజేశ్ కచప్, మన్ బిక్సల్ కొంగరి లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ మేరకు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ చార్జి అవినాష్ పాండే ప్రకటన జారీ చేశారు.
ఎమ్మెల్యేల బేర సారాల కోసమే ఈ సొమ్మును తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. జార్ఘండ్ లో ముక్తీ మోర్చా – కాంగ్రెస్ సారథ్యంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీనే ఆ సొమ్ము ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తొంది. ఇది కచ్చితంగా బీజేపీ పనేనని, బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని జార్ఘండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను జార్ఖండ్ బీజేపీ కొట్టిపారేస్తొంది. రాష్ట్రంలోని జేఎంఎం – కాంగ్రెస్ అవినీతికి పట్టుబడిన సొమ్మే ఉదాహరణ అని జార్ఘండ్ బీజేపీ నేత ఆదిత్య సాహు పేర్కొంటున్నారు.
బెంగాల్ లోని తృణమూల్ కాంగ్సెస్ కూడా ఆ ఘటనపై స్పందించింది. జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు హార్స్ ట్రేడింగ్ (బేరసారాలు) కోసమే ఈ సొమ్ము ను తరలిస్తున్నట్లు టీఎంసీ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. మహారాష్ట్ర లో మాదిరిగానే జార్ఘండ్ లో ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తొందని ఇటీవల టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.