మంకీపాక్స్ లక్షణాలతో ఓ బాలుడు (8) ఆసుపత్రిలో చేరడం గుంటూరులో కలకలాన్ని రేపింది. ఒడిశాకు చెందిన బనిత సహక్, గౌడ సహాక్ లు తమ కుమారుడు రాహుల్ సహాక్ తో కలిసి రెండు వారాల క్రితం గుంటూరు జిల్లా యడ్లపాడు స్పిన్నింగ్ మిల్లుకు వచ్చారు. రాహుల్ సహాక్ వంటిపై దద్దుర్లు రావడంతో ఈ నెల 28వ తేదీన గుంటూరు జీజీహెచ్ తీసుకువచ్చారు. మంకీ పాక్స్ లక్షణాలుగా ఉండటంతో వైద్యులు అప్రమత్తమై ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆ బాలుడి గొంతు, ముక్కు నుండి స్వాబ్ తీయడంతో పాటు రక్తం, మూత్రం శాంపిల్స్ ను సేకరించి ఏపిడిమాలజిస్ట్ డాక్టర్ వరప్రసాద్ తో శనివారం రాత్రి విమానంలో పూణెకు పంపించారు. రిపోర్టు రావడానికి మూడు రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు.
ఇప్పటి వరకూ దేశంలో మంకీ పాక్స్ కేసులు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. తొలి కేసు పాటు మరో రెండు కేరళలో. ఒకటి ఢిల్లీలో నమోదు అయ్యాయి. అయితే దేశంలో మొదటగా మంకీపాక్స్ వైరస్ బారిన పడిన కేరళ కు చెందిన వ్యక్తి పూర్తిగా కొలుకున్నాడు. మంకీ పాక్స్ బారిన పడిన కొల్లంకు చెందిన 35 ఏళ్ల బాధితుడు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో శనివారం ప్రభుత్వ వైద్య కళాశాల నుండి డిశ్చార్జ్ అయ్యారు. సదరు రోగి నుండి సేకరించిన అన్ని శాంపిల్స్ ను రెండు సార్లు పరీక్షించగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.