ఢిల్లీ, జనవరి 31 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ నుండి తాజాగా మరో న్యాయమూర్తి కూడా తప్పుకున్నారు.
ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం త్రిసభ్య ధర్మాసనం నుండి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ స్వచ్చందంగా తప్పుకున్నారు. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమనీ, ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హజరయ్యానని పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ వెల్లడించారు. విచారణలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో తాను కేసు విచారణ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ ధర్మాసనంలో ఎన్వి రమణతో పాటు జస్టిస్ మోహన్ ఎం శంతనాగౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు.
కేసు త్వరితగతిన విచారణ జరిపాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని కోరాలని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే విజ్డప్తి చేయగా తానెలా అభ్యర్థించగలని జస్టిస్ రమణ ప్రశ్నించారు.
నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే ఎన్జిఒ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తొలుత ఈ పిటిషన్ ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రాగా ఆయన తప్పుకున్నారు. సిబిఐ నూతన డైరెక్టర్ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి ఎంపిక కమిటీలో సభ్యుడుగా ఉన్నందున పిటిషన్ను విచారించలేనని ఆయన తెలిపారు.
తరువాత ఈ కేసు జస్టిస్ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. సిబిఐ డైరెక్టర్ పదవి నుండి అలోక్ వర్మను తొలగించిన కమిటీలో తాను సభ్యుడుగా ఉన్నందున తాను ఈ కూడా ఈ పిటిషన్ విచారణ చేపట్టలేనని జస్టిస్ సిక్రి కూడా తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడవ సారి త్రిసభ్య ధర్మాసనం నుంచి న్యాయమూర్తి ఎన్వి రమణ తప్పుకోవడంతో కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది.