జనసేన పొత్తులో భాగంగా మొత్తం 25 సీట్లలో పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ సీట్లలో మెజార్టీ కాపు నేతలే జనసేన సీట్ల కోసం పోటీపడుతున్నారు. మెజార్టీ కూడా కాదు జనసేన 25 సీట్లలో పోటీ చేస్తుంది అనుకుంటే 20 సీట్లలో కాపు నేతలే సీట్ల రేసులో ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఆ వర్గానికే చిరంజీవి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈ వర్గం నుంచే ప్రజారాజ్యంపార్టీ తరపున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే ఈ వర్గానికే ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల కూడా పార్టీ బాగా నష్టపోయింది.
ఇప్పుడు జనసేనలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోన్న రాజానగరం, రాజమండ్రి రూరల్, తాడేపల్లిగూడెం, భీమవరం, గాజువాక, యలమంచిలి, పెందుర్తి, విశాఖ నార్త్, నెల్లిమర్లతో పాటు పిఠాపురం, భీమిలితో పాటు అనకాపల్లి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు స్థానాలు ఇలా ఎక్కడ చూసుకున్నా కాపు నేతలే ఆశావాహులుగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీలో బీసీలు సీట్లు ఆశిస్తోన్న చోట కూడా కాపు నేతలు ఆ సీటు లాగేసుకునేందుకు రెడీ అవుతుండడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన నుంచి బీసీ మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్తానంలో నిలవడంతో పాటు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ జనసేన దెబ్బకు టీడీపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఈ సారి కూడా నాయకర్కు సీటు ఇవ్వడం న్యాయం. ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఒక వెలుగు వెలిగిన కీలక నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.
సుబ్బారాయుడు తిరగని పార్టీ అంటూ లేదు. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ తిరిగి వైసీపీ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ను కాదని కొత్తపల్లికి సీటు ఇస్తే జనసేన పట్ల బీసీల్లో ఎంత వ్యతిరేక భావం పెరుగుతుందో చెప్పక్కర్లేదు. పైగా నరసాపురం మెగా ఫ్యామిలీకి సొంత నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలోని మొగల్తూరు పవన్ కళ్యాణ్, మెగా సోదరుల స్వగ్రామం.
తన సొంత నియోజకవర్గంలో పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తోన్న బీసీ నేతను కాదని.. తన సామాజిక వర్గానికే చెందిన.. అందులోనూ తన రాజకీయ స్వలాభం కోసం ఎప్పటికప్పుడు పార్టీలు మారే నేతకు అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగానే బీసీల్లో జనసేన పట్ల బాగా వ్యతిరేకత పెరుగుతుందనడంలో సందేహం లేదు. మరి పవన్ నాయకర్కు న్యాయం చేస్తాడా ? లేదా తన కులానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు వైపే మొగ్గు చూపుతారా ? అన్నది చూడాలి.