KCR : తెలంగాణలో హోరా హోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో హాట్ హాట్ గా మారిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం , తీన్మార్ మల్లన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ఈ విజయం టీఆర్ఎస్ రథసారథి ఆస్వాధిస్తున్న సమయంలో అదే వరంగల్ లో ఇద్దరు ముఖ్య నేతలు వాదోపవాదాలు టీఆర్ఎస్ పార్టీ పరువున పలుచన చేస్తున్నాయని అంటున్నారు.
వరంగల్ లో ఏం జరుగుతోంది?
వరంగల్లో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని పదవులు అమ్ముకుంటున్నారని మాజీ డిప్యూటీ సీఎం ,ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి… కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. చేతకానివారు, ఒక్క రూపాయి సహాయం చేయనివారు కూడా మాట్లాడుతున్నాడని… చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు.
మగాడు అయితే అంటూ….
పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని, మగాడైతే ఆర్థిక సహాయం చేయాలన్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు పదవి ఇప్పిస్తాననో, పనులు ఇప్పిస్తాననో… ఒక్కరి దగ్గర ఛాయ్ తాగినా, రూపాయి తీసుకున్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు, పనులను అమ్ముకుంటూ.. సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందిన ఆనందాన్ని సైతం పొందకుండా ఈ రచ్చ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.