అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని, ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్ల యుద్ధం తారా స్థాయికి చేరింది. తొలుత వ్యంగంగా, పరోక్షంగా సాగిన విమర్శల పర్వం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది.
గత కొద్ది రోజులుగా కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అది నిన్న ఉదయం నుండి తారా స్థాయికి చేరుకున్నది. తన లాంటి వాడు పార్టీలో కొనసాగాలంటే చంద్రబాబు తన పెంపుడు కుక్కని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని అన్నారు. తాను పార్టీకి అవసరం లేదనుకుంటే ఎంపి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాననీ కేశినేని పేర్కొన్నారు.
నిన్న ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది. సంయమనం పాటించాలంటూ ఇద్దరికి పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు బుద్దా వెంకన్న ఒక మెట్టు దిగినట్లు ఆ ట్వీట్ ద్వారా తెలుస్తోంది.
‘బలహీన వర్గాలకు చెందిన నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబుకు విశ్వాస పాత్రుడిని, దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే..చంద్రబాబు కోసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నాను’ అని బుద్దా పేర్కొన్నారు.