కొడాలి నాని. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత. ఆయన మాట్లాడితే విపక్షాలకు హడలే. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఉచకోత లాంటి ఫీలింగ్.
అయితే, సదరు నేత కామెంట్లు ప్రతిపక్షానికే కాదు అధికారపక్ష నాయకులకు షాక్ కొడుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు స్వపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటుననారు. తాజాగా తిరుమలలో డిక్లరేషన్ విషయంలో కొడాలి నాని చేసిన కామెంట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాపాడే కంటే ఆయన్ను బుక్ చేసే విధంగా ఉన్నాయంటున్నారు.
జగన్ మంత్రి పదవి ఇస్తే…
కొడాలి నానిది ప్రత్యేకమైన రాజకీయ విధానం. దూకుడుగా వెళ్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సహా బాబు కోటరీపై అంతెత్తున ఫైర్ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తనకు అప్పగించిన బాధ్యతల ప్రకారం తన గళాన్ని నాని మరింత వినిపిస్తున్నారు.
రాజధానుల విషయంలో ఓకే కానీ….
అమరావతి ఒక్కటే కాకుండా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలియజేసే విషయంలో తటపటాయించారు. స్థానికుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని సైలెంట్గా ఉన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి ఇక్కడి నుంచి హైకోర్టు, సెక్రటేరియట్ తరలించడానికి మద్దతు ఇవ్వడం ఎలా అని వారు తర్జన భర్జన పడ్డారు. అయితే మంత్రి కొడాలి మూడు రాజధానులకు మద్దతు తెలియజేశారు. ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తటపటాయిస్తున్న సమయంలో ఆయన వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని బాహాటంగానే సమర్థించి జగన్ మనసు గెలుచుకున్నారు.
తిరుమల డిక్లరేషన్… తేడా కొడుతోంది నాని
తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించడం అనే అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్న ఆయన ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలని అన్నారు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!? అని నాని ప్రశ్నించారు. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవని అయన అన్నారు. తిరుమల డిక్లరేషన్ పై హిందు వాదులు, మతపెద్దలు అడగడం లేదని చంద్రబాబు మాత్రమే అడుగుతున్నారని అన్నారు. చర్చికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు ప్రభువును నమ్ముతావా అని సంతకం అడగలేదన్న ఆయన డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనని ఆ విధానం తీసేయాలని ఆయన అన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగ లేదని మంత్రి నాని ప్రశ్నించారు.
నోరు మూసుకోవడం ఎంత మంచిదంటే…
తిరుమల డిక్లరేషన్ అంశం సున్నితంగా మారడంతో దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండటమే మంచిదని మెజార్టీ వైసీపీ నేతలు భావిస్తున్నారట. కొందరు నేతలు మాత్రం అవసరమైతే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి అత్యవసరమైతే తప్ప మాట్లాడకూడదని నిర్ణయించారట. ఇలాంటి సమయంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మద్దతుగా మాట్లాడటం వల్ల ఇంకో సమస్య తప్ప ప్రయోజనం ఉండబోదని.. ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని మదనపడుతున్నారట. మరి మంత్రిగారు దీనిపై ఎలా స్పందిస్తారో.