తెలుగు రాష్ట్రాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల్లో ఆస్తినష్టం సంభవించినా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పూర్తి గా దగ్ధమైంది. ఈ ఘటన చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు టైరు పేలవడంతో డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. బస్సును పక్కకు నిలుపుదల చేసి ప్రయాణీకులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సు దగ్ధమైనా ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
మరో పక్క ఏపిలోని ప్రకాశం జిల్లాలో గ్యాస్ సిలెండర్ల లోడు తో వెళుతున్న లారీ ఇంజన్ నుండి మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. కర్నూలు నుండి ఉలవలపాడు కు సిలెండర్ల తో వెళుతున్న లారీ కొమరోలు మండలం పెద్దవాడ వద్ద ప్రమాదానికి గురైంది. లారీ ఇంజన్ నుండి మంటల చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకేశాడు. మంటల్లో లారీతో పాటు అందులో ఉన్న గ్యాస్ సిలెండర్లు పూర్తిగా దగ్ధమైయ్యాయి. లారీలో 306 సిలెండర్లు ఉండగా, మంటల ధాటికి వాటిలో వందకు పైగా సిలెండర్లు పేలిపోయాయి. సిలెండర్ల పేలుడు శబ్దాలతో ఆ ప్రాంత ప్రజలు ఉలికిపాటుకు గురైయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాతీయ రహదారిపై ఇరువైపులా అర కిలో మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేశారు. గ్యాస్ సిలెండర్లు పేలుతుండటంతో అటు వైపు వాహనదారులు వెళ్లకుండా పోలీసులు నిరోధించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడ లో సుమారు 30 ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటం అక్కడకు చేరుకున్నా సిలెండర్లు పేలుతుండటంతో 200 మీటర్ల దూరం నుండే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ రెండు భారీ అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించినా, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
దివంగత సీఎం వైఎస్ఆర్ కు నేతల ఘన నివాళులు.. ఇడుపులపాయలో ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల