రాజకీయ ఎత్తుగడల్లో అందెవేసిన చేయి అనే పేరున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఒకింత ఆలోచనలో పడుతున్న పరిస్థితి. ముందున్న సవాల్ను ఎదుర్కునేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియని సందిగ్దంలో పడిపోయారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ నేతల వల్లే. ఇదంతా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక గురించి.
నాగార్జున సాగర్ లో అసలైన సవాల్
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బై పోల్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సాగర్లో అభివృద్ధిపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న గులాబీ పార్టీకి ఈ ఎన్నిక కత్తి మీద సాములా కనబడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయం వస్తోంది. కానీ దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది .
దుబ్బాక నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకూ ….
టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం అభ్యర్థి విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడింది. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది.
ఆ మంత్రి నుంచి ఒత్తిడి
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా టీఆర్ఎస్ చీఫ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి . సాగర్ నియోజకవర్గ నేత కోటిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరును తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లోనే రవీందర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగినా సీనియర్ నాయకుడైన నోముల నర్సింహయ్యకు ఇచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సీటు నిలుపుకోవడం ఎంత ముఖ్యమో అందుకు తగినట్లుగా అభ్యర్థిని నిలబెట్టడం కూడా అంటే ముఖ్యమని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.