ఆర్థిక సమస్యలు అనేవి మనకు చెప్పి రావు. ప్రమాదాల్లా చెప్పకుండానే వస్తాయి. అలాంటి సమయాల్లో మనకు క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. బిల్ జనరేట్ అయిన తేదీ తరువాత నుంచి మళ్లీ బిల్ వచ్చే వరకు సుమారుగా 30 రోజుల పాటు మనకు ఎలాంటి వడ్డీ లేకుండా నగదును అందిస్తాయి. అయితే బిల్ గడువు తీరాక కూడా కట్టకపోతే అప్పుడు వడ్డీ, ఫైన్, ఇతర చార్జీలు కూడా పడుతాయి. అందువల్ల క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అయితే క్రెడిట్ కార్డులు పోయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు పోయినప్పుడు వెంటనే ఆ కార్డును జారీ చేసిన బ్యాంకుకు ఫోన్ చేసి కార్డు పోయిందని చెప్పి సమాచారం అందించాలి. వెంటనే కార్డును బ్లాక్ చేయించాలి. అందుకు బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్కు కాల్ చేయవచ్చు. లేదా ఎస్ఎంఎస్ పంపవచ్చు. అలా కుదరకపోతే బ్యాంకు అందించే క్రెడిట్ కార్డు మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్లలో.. ఏ రూపంలో అయినా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు. దీంతో భారీ మొత్తంలో నష్టం జరగకుండా ఉంటుంది. అలాగే కార్డు పోయినవెంటనే బ్లాక్ చేయడం వల్ల ఏదైనా ఫ్రాడ్ జరిగితే జరిగే నష్టం మన మీద పడకుండా ఉంటుంది. వాటికి బ్యాంకులే పూర్తిగా బాధ్యత వహిస్తాయి.
ఇక వినియోగదారులు క్రెడిట్ కార్డును బ్లాక్ చేశాక తమకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవాలి. దీని వల్ల మనకు బ్యాంకులపై ఇంకా అధికారం వస్తుంది. అలాగే మన చేతిలో పవర్ ఉంటుంది. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ కాపీలను అడుగుతాయి. కనుక ఆ కాపీని ముందుగానే తీసుకోవడం బెటర్.
ఆ తరువాత వినియోగదారులు కొత్త కార్డుకు అప్లై చేయాలి. ఆ సమయంలో బ్యాంకులు ఎఫ్ఐఆర్ కాపీని అడిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ కాపీని ముందుగానే తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం కొత్త కార్డుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలాగే కొత్త కార్డుకు కొన్ని బ్యాంకులు స్వల్ప మొత్తంలో ఫీజును కూడా వసూలు చేస్తాయి. ఆ ఫీజు కార్డుకు వచ్చే తదుపరి బిల్లో యాడ్ అవుతుంది.
కాగా ప్రస్తుతం అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ)ని అందిస్తున్నాయి. కార్డుకు ఉన్న లిమిట్, ఇతర సదుపాయాలను బట్టి ఏడాదికి రూ.1వేయి నుంచి రూ.3వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కార్డు దొంగతనానికి గురవడం, స్కిమ్మింగ్, ఫిషింగ్ వంటి దాడులకు గురి కావడం జరిగితే.. ఏర్పడే నష్టం నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయి. అలాగే కార్డు చోరీకి గురైనా, పోయినా బ్యాంకుకు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తే చాలు.. వారే కార్డును బ్లాక్ చేస్తారు. ఈ సదుపాయాన్ని కూడా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ఆయా కంపెనీలు అందించే వాలెట్లలో వినియోగదారులు ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్, డెబిట్ కార్డులను సేవ్ చేసుకుంటే వాటన్నింటికీ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. ఇలా క్రెడిట్ కార్డులనే కాదు, డెబిట్ కార్డులను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీని వల్ల నష్టం జరిగినా మనం భరించాల్సిన పని ఉండదు.