రాత్రి భార్య భర్త గొడవ పడ్డారు. భర్త అలిగి ఆరుబయట పడుకున్నాడు. ఉదయానికి విగత జీవుడయ్యడు. ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే విషయాలు పోలీస్ దర్యాప్తులో తెలవలసి ఉంది. ఈ ఘటన కడప పట్టణ శివారులోని భగత్సింగ్నగర్లో జరిగింది.
వివరాల్లోకి వెళ్ళితే… భగత్సింగ్నగర్కు చెందిన పాలకొల్లు నాగేంద్ర అలియాస్ నాగేష్ (40), లక్షీదేవిలకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి 15 ఏళ్ల కూతురు ఉంది. నాగేంద్ర ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. నాగేంద్ర కొద్ది రోజులుగా మద్యానికి బానిసై భార్య, కూతురిని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కూడా నాగేంద్ర ఇంట్లో భార్యతో గొడవపడి అరు బయట మంచం వేసుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్రను మంచం కొళ్లతో తలపై, ఛాతిపై, ముఖంపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కడప డిఎస్పీ సూర్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నాగేంద్ర హత్య వెనుక బంధువుల హస్తం ఉన్నట్లు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కాగా నాగేంద్ర సమీప బంధువు ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.