హైదరాబాద్: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలును వైద్యులు తొలగించారు. ప్రమాదంలో అతని కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇంకా అతనికి అత్యవసర చికిత్స అందించాలని పేర్కొన్నారు.
ఈనెల 11న ఎంఎంటీఎస్ రైలు, కర్నూలు ఇంటర్ సిటీ రైలును ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయి. ఆ సమయంలో లోకో పైలట్ చంద్రశేఖర్ ఇంజిన్లోనే ఇరుక్కుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద అతన్ని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సిగ్నలింగ్ తప్పులేదని, సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలెట్ ముందుకు వెళ్లాడని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.