Sirivennela: పరమేశ్వరుడిని తిడుతూ స్తుతించవచ్చా..!? బూడిదిచ్చేవాడినేది అడిగేది..? ఇది ప్రశ్న.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా శివుణ్ణి తిడుతూ, అంతర్లీనంగా స్తుతిస్తూ పాడాల్సిన పాట.. సిరివెన్నెల రాసిన మొదటి పాట ఇది. సాహసమే.. కానీ కె. విశ్వనాధ్ నమ్మారు, ఏడిద నాగేశ్వరరావు చెప్పారు.. సీతారామశాస్త్రి రాశారు.. బాలు పాడారు.. తెలుగు సినీ ప్రపంచానికి ఒక కొత్త గేయరచయితని పరిచయం చేసిన ఈ పాట నూరు దశాబ్దాలు నిలిచే ఉంటుంది.. అలా “సిరివెన్నెల” సినిమాల్లో రచయితగా పరిచయమయ్యారు. ఇదే సినిమాలోని “విధాత తలపున” పాటకి నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో ప్రతీ పాట ఒక పద సంపదే. తెలుగులో గతంలో వినని, ప్రయోగించని కొత్త పదసిరిని “సిరివెన్నెల” అందించారు. అలా 1986లో పరిచయమైన ఆయన కలం 2021 లో ఆర్ఆర్ఆర్ లో దోస్తీ పాట వరకు మూడున్నర దశాబ్దాలు సాగింది. వేల సంఖ్యలో పాటలు రాశారు. కానీ ఎక్కడా బూతుల్లోకి తొంగి చూడలేదు. వేటూరిలా శృంగార పాళ్ళ కోసం పక్కదారి చూడలేదు.. చంద్రబోస్ లా ప్రకృతినే నమ్ముకుని పోల్చలేదు.. రామజోగయ్యలా ప్రాసలకోసం పాకులాడలేదు..! వీళ్ళందరూ తక్కువని కాదు.. ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. కానీ.. సిరివెన్నెల పదసంపద ముందు, కలజ్ఞానం ముందు, పదసిరి ఈ అందరూ దిగదుడుపే..!
Sirivennela: పోటీతో తప్పలేదు..! కానీ తప్పులు ఒప్పుకున్నారు..!!
సిరివెన్నెల కాలానికి మొదటి దశాబ్దం పాటు ఎదురు లేకుండా పోయింది. ఆయన రాసిన ప్రతీ పాట ఆణిముత్యమే. కె. విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, కోదండరామిరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీ లాంటి అప్పటి దర్శకులకు ఆయన ఒక వరం.. దర్శకుల మైండ్ లో వచ్చిన ఆలోచనలను పాటగా రాసి ఇచ్చేసేవారు. ఒక్కోసారి పాటకు అరగంట మాత్రమే తీసుకునే సిరివెన్నెల… కొన్ని పాటలకు రెండు, మూడు రోజులు కూడా తీసుకున్న సందర్భాలున్నాయి.
* 1993లో గాయం సినిమాలో వచ్చిన “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని…! 1999లో సింధూరం సినిమాలోని “అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని” పాట దేశంలో వ్యవస్థలు, రాజకీయ మనుగడని ఆవేశంగా ప్రశ్నిస్తుంది.. జనాలను ఆలోచింపజేస్తాయి.
* ముఖ్యంగా 2000 దశకం ఆరంభం నుండి దర్శకుల అవసరాలు మారాయి. అలా ఆ అవసరానికి తగ్గట్టు సిరివెన్నెల కలం కూడా మారాల్సి వచ్చింది. 1986 నుండి 2000 మధ్య దాదాపు 5 వేల పాటలు రాసిన ఆయన… 2000 దశకం తర్వాత మరింత పదునెక్కిన పాటలు రాశారు. మురారిలో “అలనాటి రామచంద్రుడు”.. గమ్యం సినిమాలో “ఎంత వరకు వింతపరుగు.. బొమ్మరిల్లులో నమ్మకతప్పని నిజమైనా.., చక్రం సినిమాలోని జగమంతా కుటుంబం నాది.., వంటి పాటలకు కాస్త శ్రమపడ్డానని ఆయన ఓ సందర్భంలో చెప్పారు.
* అయితే సిరివెన్నెల జీవితం విషయాల్లో కొన్ని చేదు నిజాలు చెప్పుకోవాలి. దర్శకుల అవసరాలు మారడం.. సినిమాకు బూతు అవసరం పడడం.. మాటలు కాదనలేక కొన్ని పరోక్ష పదాలను ప్రయోగించారు. అల వైకుంఠపురంలో హీరోయిన్ కాళ్ళను పొగుడుతూ హీరో “నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు” అంటూ రాసిన పాట సిరివెన్నెలలో మరో కోణాన్ని చూపించింది. 1990వ దశకంలో కూడా కె. రాఘవేంద్రరావు అవసరం మేరకు కొన్ని చెండాలపు పాద ప్రయోగాలు చేసినట్టు సిరివెన్నెల కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అవార్డుల పంట.. కానీ చిన్నవే..!
సిరివెన్నెలకు మొత్తం 11 నంది అవార్డులు వరించాయి. ఆయన గేయరచయితగా పరిచయమైనా సినిమా “సిరివెన్నెల”లోని విధాత తలపున పాటకు మొదటి నంది.. 1987 లో శ్రుతిలయలు పాటకు మరో నంది.., 1988లో “అందేలా రవమిది” పాటకు మూడో నంది.. అలా మూడేళ్లు మూడు వరుస నందులు గెలుచుకున్నారు. మొత్తం మీద సిరివెన్నెల 11 నంది అవార్డులు, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 2005 తర్వాత కొత్త తరం రచయితలు వచ్చేసారు. రామజోగయ్యశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు రావడంతో సిరివెన్నెల కాలానికి కాస్త విశ్రాంతి దొరికింది. కానీ ఆ కలంలో వాడి తెలిసిన దర్శకులు మాత్రం ఆయన చేతనే రాయించేవారు. ఆ కోవలోకే “గమ్యం, కంచె, చక్రం జానూలో లైఫ్ అఫ్ రామ్ వంటి పాటలు వస్తాయి.. ఆ తర్వాత కూడా అయన ఏడాదికి 30 నుండి 40 పాటలు రాస్తూ వచ్చారు. 2020 లో 28 పాటలు రాశారు. 2021లో కూడా 18 పాటలు పూర్తి చేశారట..! అలా ఆయన కలం కొన్ని వేల పదాలను జనం మెదళ్లలోకి నెట్టి.. ఆలోచింపజేసి.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చి.. విశ్రాంతి కోసం వెళ్ళింది. కానీ అల.., ఇల ఉన్నంత కాలం ఆ కలం కలకాలం ఉంటుంది..!!
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!