దేశ రాజధాని ఢిల్లీలో ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ఆయనతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. చంద్రబాబుతో రఘురామ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే చంద్రబాబు వద్ద రఘురామ కృష్ణంరాజు ఓ షాకింగ్ ప్రతిపాదన చేయడం సంచలనం అయ్యింది. చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నాననీ తెలియజేసిన రఘురామ, టీడీపీ ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించేందుకు చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలిపారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ పెద్దలు తరచు చెబుతూనే ఉన్నారు. చంద్రబాబే హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని వైసీపీ గతం నుండి విమర్శిస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఉద్యమాన్నే ఎత్తుకుని టీడీపీ కేంద్రంలోని బీజేపీ నుండి దూరం అయ్యింది. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు దోస్తీ కటీఫ్ చేసుకున్న తర్వాత రాష్ట్రంలో టీడీపీకి ఊహించని నష్టం జరిగింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గర కావాలనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ తరుణంలో కేంద్రంతో పేచీ పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్దం గా లేరు. అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు అడగకపోయినా ఎన్డీఏ అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇచ్చింది.
ఏదో విధంగా బీజేపీ పెద్దలను మరో సారి ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్న తరుణంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని రఘురామ ప్రతిపాదన తీసుకురావడం నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యిందని అంటున్నారు. తన ప్రతిపాదనపై చంద్రబాబు ఏమన్నారు అనేది మాత్రం రఘురామ తెలియజేయలేదు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఏపికి సంబంధించి అధికార, విపక్షాలు కేంద్రంలోని ఎన్టీఏకి అనధికార మిత్రపక్షాలే అన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎంపి రఘురామ ప్రతిపాదనపై టీడీపీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.