వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కమలం పార్టీ తన ఆపరేషన్ ను ప్రారంభించింది. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో నామమాత్రావశిష్టంగా మిగిలిపోయిన పార్టీ పునరుత్తేజం పొందడానికి సానుకూలమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీల బలహీనతలు తమ పార్టీకి వరంగా మారబోతున్నాయని బీజేపీ బలంగా భావిస్తోంది. .ఏడాదిగా తెలుగుదేశం, వైసీపీల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం భారీగానే జరిగింది. తాజాగా వైసీపీ సర్కారు తెలుగుదేశం నేతలపై టార్గెట్ ఫిక్స్ చేసుకోవడంతో బీజేపీ కి రాజకీయంగా కలిసి వస్తోంది. ఆర్థిక పరమైన కార్యకలాపాలు, వ్యాపారాలు ఉన్న టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీకి పూర్తి విధేయత కనబరిచేవారిపై సర్కారు అవినీతి కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ ఆశ్రయం కావాల్సిన నేతల సంఖ్య పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీని బదనాం చేసే క్రమంలో వైసీపీకి తాము కూడా మద్దతివ్వాలనేది బీజేపీ యోచన. అందువల్ల ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా బలహీన పడుతుంది. ఆ పార్టీ క్యాడర్ , నాయకులు బీజేపీలో చేరే అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమైన టీడీపీపై ప్రతీకారం తీసుకున్నట్లవుతుంది. ఈ కారణంగానే వైసీపీ, టీడీపీ వైరం బీజేపీకి వరంగా మారేందుకు చాన్సులు పెరుగుతున్నాయి.
తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ స్థానాన్ని రాజకీయంగా అందిపుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. గతప్రభుత్వ తప్పిదాల పేరిట టీడీపీ నేతలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే చర్యలకు గట్టిగా మద్దతిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కారు పాలనపరమైన లోపాలు, అవినీతిపై ఉద్యమాలు చేసేందుకూ సిద్ధమవుతోంది. రెండు ప్రధానపార్టీలతో పోరాటానికి తగినంత నైతిక, అంగబలం బీజేపీకి లభించినట్లేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరతారని ఆశిస్తున్నారు. వైసీపీ సర్కారు టీడీపీపై ఎంత కఠినంగా వ్యవహరిస్తే భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలో అంతగానూ మేలు చేకూరే పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగుదేశం విషయంలో బీజేపీ కొంచెం కఠినమైన వైఖరినే తీసుకుంది. అలాగని వైసీపీని వదిలేది లేదంటున్నారు నాయకులు. అధికారపార్టీలో అసంత్రుప్తిగా ఉన్నవారికి గాలం వేస్తోంది కమలం పార్టీ. ప్రభుత్వ విధానాలు నచ్చక ఎంతగా నలిగిపోతున్నా ప్రధానప్రతిపక్షమైన టీడీపీని ఆశ్రయించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీనిని బీజేపీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. నరసాపురం ఎంపీ రఘురామక్రుష్ణంరాజు వంటి నాయకులు ఇప్పటికే కమలం పార్టీ తో పూర్తి స్థాయి సంబంధాలు నెలకొల్పుకున్నారు. దీంతో ఆపరేషన్ కమల్ మొదలైనట్లే నంటున్నారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు, నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున చేరికలుంటాయనేది అంచనా.మొత్తం మీద బిజెపి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ జగన్ మొదలెట్టినట్టు స్పష్టంగా గోచరిస్తుంది.