హైదరాబాద్ః సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులకు పార్సిళ్ల ద్వారా వచ్చిన బాటిళ్లకు సంబంధించిన మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక తేల్చింది. పార్సిల్ బాటిళ్లతో పాటు ఒక లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో విద్యార్థులు ఓయూలో మురుగు నీటినే తాగుతున్నారని రాశారు. కేసీఆర్ పేరిట అజ్ఞాత వ్యక్తులు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 17న వీఐపీల పేర్లతో 62 కార్టన్ బాక్స్ లను బుక్ చేశారు. సీఎం కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, సినీ నటులు చిరంజీవి, వెంకటేష్ లాంటి ప్రముఖుల పేర్లతో ఈ పార్సిల్ లను బుక్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు. ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓయూ పరిసర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన వారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన పద్ధతి ఎంచుకొని ఉంటారని పోలీస్లు భావిస్తున్నారు. విద్యార్థులెవరైనా ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
previous post
next post