అమరావతి: కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్తో సహా కరకట్టపై ఉన్న 32 భవన యజమానులకు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ తాడేపల్లి తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు.
తహశీల్దార్ అదేశాల మేరకు ఉండవల్లి విఆర్ఒ ప్రసాద్ నోటీసు జారీ చేసేందుకు చంద్రబాబు నివాసానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ నోటీసును విఆర్ఒ గోడకు అంటించి వెళ్లారు.
వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నోటీసులు జారీ చేసినట్లు తాడేపల్లి తహశీల్దార్ తెలిపారు.