విజయవాడ: కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణమ్మ మహోగ్ర రూపం నదీతీర గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం ఊళ్లను, యేర్లను ఏకం చేస్తున్నది. నదీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న గ్రామాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు చాలా చోట్ల సముద్రాలను తలపిస్తున్నాయి. నిన్నటి దాకా బస్సులు, వాహనాలు ప్రయాణించిన రోడ్లపై ఇప్పుడు పడవలు తిరుగుతున్నాయి. నాగార్జున సాగర్ నుండి వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్టే పులివెందుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వదులుతుండటంతో పరిస్థితి శనివారం మరింత ఆందోళనకరంగా మారింది. మరో రెండు రోజుల పాటు ఇదే ఉధృతి కొనసాగుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, రావిరాల, వేదాద్రి, చందర్లపాడు మండలం ఉస్థేపల్లి, కంచికచర్ల మండలం చెవిటికల్లు, గనిఆత్కూరు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఈ గ్రామాలను గురువారం వరద చుట్టిముట్టింది. దివిసీమ ప్రాంతాన్ని కూడా ముంచెత్తింది. రావిరాల, ఉస్థేపల్లిల్లో లోతట్టులో ఉన్నవారిని మెరక ప్రాంతాలకు తరలించారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న సాగునీటి ఎత్తిపోతల పథకాలు, మంచి నీటి పంపింగ్ స్కీమ్లు వరద నీటిలో మునిగిపోయాయి. శనివారం ఉదయం నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో కృష్ణానది రెండు వైపులా అంచులను తాకుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కులు రాగా దిగువకు మొత్తం విడుదల చేస్తున్నారు.
వాగులు, వంకలకు వరద నీరు ఎగదన్నడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రమ్మకయ్య 15అడుగుల ఎత్తున పొంగుతూ ముక్త్యాలకు రాకపోకలను స్తంభింపజేసింది. జయంతిపురం లోతట్టు వద్ద ఆరు అడుగుల మేర వరద నీరు పారుతుండటంతో జగ్గయ్యపేట – వేదాద్రి రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మయ్య వాగు పది అడుగులకు పైగా పారుతుండటంతో కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకొన్నాయి. ఇప్పటికే వరదనీరు కరకట్టను ఒరుచుకొని ప్రవహిస్తున్నది. లంక గ్రామాలకు వెళ్లే అరవింద వారధి వద్ద కట్ట తెగి రాకపోకలు నిలిచిపోయాయి. లంకల్లో వేసిన పసుపు, కంద, అరటి తదితర పంటలు పూర్తిగా జలసమాధి కాగా, ఇటుక బట్టీలు వరద నీటిలో మునిగిపోయాయి. పెదమద్దూరు వద్ద కృష్ణానది ఉప్పొంగడంతో అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు సాగలేదు.
కాగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా, ప్రస్తుతం 585.30 అడుగుల మేరకు నీటి నిల్వ ఉంది. ఈ వరద ప్రవాహంతో సాగర్లోని విఐపి ఘాట్లోని శివాలయంలోకి పూర్తిగా నీరు చేరడంతో దర్శనాలు నిలిచిపోయాయి. గుంటూరు-సూర్యాపేట జిల్లాలను కలిపే మట్టంపల్లి బ్రిడ్జికి వరద ప్రవాహం తాకడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శ్రీశైల జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుండి ఏడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు 14గేట్లను ఎత్తి 8.12లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వదలగా ఇందులో 7.57లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్యారేజీ వైపు వెళ్లే మొత్తం ట్రాఫిక్ను సీతమ్మవారి పాదాల ఘాట్ నుంచి వివిధ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రాత్రి నుంచి శుక్రవారం ఉదయం నాటికి మొత్తం 90 టిఎంసిల నీరు హంసలదీవి వద్ద సముద్రంలో కలిసింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగుల వద్ద కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. బ్యారేజీకి మరో మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు ప్రకాశం బ్యారేజి వద్ద ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 140మంది ఫైర్ సిబ్బంది 18 బోట్లతో సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మోపిదేవి, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికచర్ల, కెల్లిపర, కొల్లూరు, తుళ్లూరు, సీతానగరం తదితర మండలాలలో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. వరద బాధితులకు కృష్ణాజిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావస కేంద్రంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు వరద ముంపు ప్రభావానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.